ఒకరి తరువాత ఒకరు రేప్ చేసినట్టు తయారైంది నా పరిస్థితి..
బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ నాయకులు కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. కోట్ల రూపాయల మేర డబ్బు, పదవులను ఆశ చూపి వారిని ప్రలోభాలకు గురి చేస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఫలితంగా- కాంగ్రెస్ గానీ, జేడీఎస్ గానీ.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు దిగాల్సి వస్తోంది.
బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 50 కోట్ల రూపాయలను ఇస్తామని తమ ఎమ్మెల్యేను సంప్రదించారని ఇటీవలే ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమారస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను ఆయన స్వయంగా మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీని ఒక ఊపు ఊపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఇదే అంశంపై ఎడతెగని చర్చ సాగుతోంది. వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం.. దీనిపై జరగాల్సిన చర్చ పక్కదారి పట్టింది.
ఈ ఆడియో టేపులు తమవి కాదని, అందులో మాట్లాడినది తాను కాదని యడ్యూరప్ప చెబుతున్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, తమ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కుట్ర పన్నిందని అధికార కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ దీన్ని ఖండిస్తోంది. ఇందులో స్పీకర్ రమేష్ కుమార్ జోక్యం చేసుకున్నారు. ఆడియో టేపుల్లో ఉన్న నిజాన్ని వెలికి తీయడానికి ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు సిట్.. తన పని మొదలు పెట్టింది. దీనిపై కూడా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా స్పీకరే సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించడాన్ని బీజేపీ తప్పు పడుతోంది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. పరస్పర ఆరోపణలతో సభలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదంలోకి బీజేపీ నాయకులు స్పీకర్ రమేష్ కుమార్ లాగారు.
స్పీకరే దీనికంతటికీ కారణమని, సిట్ వేయాలని ఆదేశించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరోపణలు గుప్పించారు. సభా పరువును స్పీకర్ వీధిన పడేశారని ధ్వజమెత్తారు. దీనితో స్పీకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిపక్ష సభ్యులు ఈ వివాదంలో పదే, పదే తన పేరును ప్రస్తావించడాన్ని స్పీకర్ సహించలేకపోయారు. తనకు సంబంధం లేకపోయినా, స్పీకర్ స్థానంలో ఉన్న తనపై ఎందుకు బురద చల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.
ఒకరి తరువాత ఒకరు నాపై అత్యాచారం చేసినట్టు తయారైంది నా పరిస్థితి.. అని ఆయన వ్యాఖ్యానించారు. దారుణంగా అత్యాచారానికి గురైన బాధితులు న్యాయస్థానం ముందు నిల్చుంటే న్యాయవాదులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో..అలాంటి ప్రశ్నలను మీరు (సభ్యులు) నాపై వేస్తున్నారు. ఒకరిపై ఒక్కసారే అత్యాచారం జరుగుతుంది. న్యాయస్థానాల్లో వందసార్లు అత్యాచారం చేస్తారు. అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఎంతమంది రేప్ చేశారు? అని బాధితులను ప్రశ్నిస్తారు. ఇప్పుడు నా పరిస్థితీ అలాగే తయారైంది. మీరంతా కలిసి ఒకరి తరువాత ఒకరుగా నాపై అత్యాచారం చేస్తున్నారు.. అని స్పీకర్ వాపోయారు.
అత్యాచారానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చేసే సమయంలో నలుగురైదు మంది మహిళా సభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, రామనగరకు చెందిన జేడీఎస్ సభ్యురాలు అనితా కుమారస్వామి కూడా సభలోనే ఉన్నారు. ఊహించని విధంగా స్పీకర్ చేసిన అత్యాచార వ్యాఖ్యానాలతో మహిళా సభ్యులు తల వంచుకున్నారు. ఇతర సభ్యులు మాత్రం గట్టిగా నవ్వారు. సభలో వేడెక్కిన వాతావరణాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు.
ఇంత ఘాటుగా వ్యాఖ్యానించినప్పటికీ.. బీజేపీ మాత్ర తన పట్టు వదల్లేదు. సిట్ ను ఉపసంహరించుకోవాలని వారు పట్టుబడుతున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. సభను స్తంభింపజేస్తున్నారు. సిట్ ఏర్పాటు ఆదేశాల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రతిపక్ష బీజేపీ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కమలను తాము చేపట్టలేదని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వమే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు. ఈ ఆడియో టేపుల వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి కుమారస్వామి హస్తం ఉందని బీజేపీ సభ్యులు చెబుతున్నారు.