అనుకున్నదే జరిగింది: కర్ణాటక శాసన సభా సమావేశాలు వాయిదా, రాత్రి అసెంబ్లీలో బీజేపీ ధర్నా !
బెంగళూరు: కర్ణాటకలో అధికారం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వారు అనుకున్నది సాదించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని, శాసన సభా సమావేశాలు వాయిదా పడేలా చూడాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
అసెంబ్లీలో రచ్చరచ్చ కావడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసన సభా సమావేశాలు వాయిదా వేశారు. తమకు న్యాయం జరిగే వరకూ రాత్రి పూర్తిగా అసెంబ్లీలోనే ఉంటామని, కావాలనే సభను వాయిదా వేశారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభలోనే ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రెండు సార్లు సభ వాయిదా పడిన తరువాత గురువారం సాయంత్రం మళ్లీ శాసన సభా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు.
శాంతియుతంగా కుర్చోవాలని, చర్చకు అవకాశం ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి పదేపదే మనవి చేశారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పదేపదే బీజేపీ డౌన్ డౌన్ అంటూ చర్చకు తావు ఇవ్వకుండా నినాదాలు చేశారు.
శాసన సభా సమావేశం రచ్చరచ్చ కావడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ వాయిదా వేశారు. తమకు అన్యాయం జరిగిందని, న్యాయం జరిగే వరకూ రాత్రి పూర్తిగా అసెంబ్లీలోనే నిరసన వ్యక్తం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు. యడ్యూరప్పతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలోనే ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.