కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముందుగానే హెచ్చరించారని వెలుగు చూసింది. సిద్దార్థ ఆపదలో ఉన్నారని, ఆయన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని వినయ్ గురూజీ సిద్దార్థ కుమారుడికి సూచించారని తెలిసింది.
వి.జి.సిద్దార్థ ఆచూకి గురించి అడిగి తెలుసుకుందామని ఆయన కుటుంబ సభ్యులు వినయ్ గురూజీకి ఫోన్ చేసిన సమయంలో నీళ్లు కనపడుతున్నాయి, ఆపదలో ఉన్నారు అని హెచ్చరించారని సమాచారం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు వినయ్ గురూజీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎస్.ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు గురూజీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు.
సిద్దార్థ కనపడటం లేదని తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ సతీమణి ప్రేమా కృష్ణ (సిద్దార్థ అత్త) వినయ్ గురూజీకి ఫోన్ చేశారు. ఆ సందర్బంలో తనకు నీళ్లు కనపడుతున్నాయని వినయ్ గురూజీ ఎస్.ఎం. కృష్ణ సతీమణి ప్రేమా కృష్ణకు చెప్పారని సమాచారం. తరువాత వినయ్ గురూజీ ఎస్.ఎం. కృష్ణ సతీమణి ప్రేమా కృష్ణకు ఏం చెప్పారు ? అనే విషయం మాత్రం బయటకురాలేదు.
సిద్దార్థ కుమారుడు అమాధ్య ఆదివారం వినయ్ గురూజీని కలిసిన సందర్బంలో మీ తండ్రి ఆపదలో ఉన్నారని, బాగా చూసుకోవాలని, ఆయన ఎక్కువ ఒత్దిడిలో ఉన్నారని, ఇలాంటి సమయంలో నీవు తోడుగా ఉండాలని హెచ్చరించారని వెలుగు చూసింది.
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కోప్ప తాలుకా హరిహరపురకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో గౌరిగెద్ద స్వర్ణ పీఠికేశ్వరి దత్తాశ్రమ ఆశ్రమంలో 30 ఏళ్ల వయసు ఉన్న వినయ్ గురూజీ నివాసం ఉంటున్నారు. వినయ్ గురూజీకి ప్రముఖ రాజకీయ నాయకులు భక్తులు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రులు ఎస్.ఎం. కృష్ణ, హెచ్.డి. కుమారస్వామి, డీకే. శివకుమార్, మాజీ స్పీకర్ రమేష్ కుమార్, ఎంఎల్ సీ టీఎ. శరవణ తదితర ప్రముఖులు వినయ్ గురూజీ భక్తులు.