కర్ణాటక: రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలు: 4 రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ: ఏపీకి ఓకే
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ను కర్ణాటక ప్రభుత్వం దాదాపు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. జనం ఒకేచోట గుమికూడే సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, కల్యాణ మండపాలు, హోటళ్లు వంటివి తప్ప అన్నింటినీ సడలించింది. బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. ప్రైవేటు బస్సులు, ఆటోలు, క్యాబ్లు కూడా రోడ్కెక్కడానికి అనుమతి ఇచ్చింది. మంగళవారం నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రెడ్జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ యధాతథంగా కొనసాగుతుంది.
నాన్ కంటైన్మెంట్ జోన్లలో దాదాపుగా ఎత్తివేత..
అదే సమయంలో- నాలుగు రాష్ట్రాల సరిహద్దులను ఇంకా పునరుద్ధరించదలచుకోలేదని స్పష్టం చేసింది. ఇందులో ఏపీని మినహాయించింది. నాన్ కంటైన్మెంట్ క్లస్టర్లలో దుకాణాలు కూడా తెరవడానికి వీలు కల్పించినట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరు విధానసౌధలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సడలింపు వివరాలను ఆయన వెల్లడించారు. రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
బస్సుకు 30 మందే..
కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, నైరుతి ఆర్టీసీ బస్సు సర్వీసులను మంగళవారం నుంచి పునరుద్ధరించబోతున్నట్లు తెలిపారు. ఇదివరకట్లాగే ఆయా బస్సుల రాకపోకలు రాకపోకలు సాగిస్తాయని అన్నారు. బృహన్ బెంగళూరు కార్పొరేషన్ బస్సుల పునరుద్ధరణపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కో బస్సుకు పరిమితంగా 30 మంది ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంటుందని ఆదేశాలను జారీ చేస్తామని యడియూరప్ప తెలిపారు. 30 మందికి కంటే ఎక్కువగా టికెట్లను జారీ చేయబోమని అన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.
మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి..
ప్రజలు మాస్కులను ధరించడాన్ని తప్పనసరి చేశామని యడియూరప్ప తెలిపారు. మాస్కులను ధరించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోషల్ డిస్టెన్సింగ్ను విధిగా పాటించాలని సూచించారు. ఆటోల్లో ఇద్దరికి, మ్యాక్సీ క్యాబ్స్లల్లో ముగ్గురికి మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇచ్చామని అన్నారు. ఆటోల్లో ఇద్దరు ప్రయాణికులను మించి, మ్యాక్సీ క్యాబ్స్లల్లో ముగ్గురికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే డ్రైవర్లపై భారీ జరిమానా విధిస్తామని యడియూరప్ప స్పష్టం చేశారు.
Recommended Video
ఏపీ మినహా ఆ నాలుగు రాష్ట్రాల సరిహద్దులు మూసివేత..
పబ్లిక్ పార్కులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మాత్రమే పార్కులను తెరవాలని అధికారులను ఆదేశించారు. నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో బార్బర్ షాపులను కూడా తెరవచ్చని అన్నారు. గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను ఈ నెల 31వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని యడియూరప్ప స్పష్టం చేశార. ప్రయాణికుల కోసం ఆయా రాష్ట్రాల సరిహద్దులను మూసివేసినట్లు చెప్పారు. ఇందులో ఏపీని మినహాయించినట్లు చెప్పుకొచ్చారు.