ఆ ఐదు రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ బంద్, కరోనా కేసులు పెరగడంతో కీలక నిర్ణయం..
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర తర్వాత గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చే రవాణాను నిషేధిస్తున్నట్టు పేర్కొన్నది. గురువారం ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసిషన్ తీసుకుంది. విమానాలు, రైళ్లు, వాహనాలు.. ఏ రూపంలోనూ రాష్ట్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది. అయితే కర్ణాటక నుంచి ఆ రాష్ట్రాలకు వెళ్లేవారికి ఆంక్షలు లేవు. వారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని తెలిపింది.
Recommended Video
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 వేల 493కి చేరింది. వీరిలో 809 మందిని డిశ్చార్జ్ చేయగా.. 47 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1635 మందికి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 25 మందిని డిశ్చార్జ్ చేశారు. 75 పాజిటివ్ కేసుల్లో 46 కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఆరుగురు తమిళనాడు, ఇద్దరు తెలంగాణ, కేరళ, ఢిల్లీ నుంచి ఒక్కరు వచ్చారని అధికారులు తెలిపారు. మరొకరు యూఏఈ నుంచి వచ్చారని పేర్కొన్నారు. రోగుల బంధువులు ఏడుగురికి వైరస్ సోకిందని తెలిపారు. మరో 10 మంది కాంటాక్ట్ అయ్యారని చెప్పారు.
వీరిని జిల్లాల వారీగా చూస్తే.. ఉడుపి జిల్లాలో 27 మంది, హసన్లో 13, బెంగళూరు అర్బన్, యాద్గిర్లో ఏడు చొప్పున.. చిత్రదుర్గ, దక్షిణ కన్నడలో ఆరు, కలబురాగి, చిక్కమంగళూరులో మూడు, విజయపురలో రెండు, రాయిచూర్లో ఒక్కరికీ వైరస్ సోకిందని పేర్కొన్నారు.