కరోనా ఎఫెక్ట్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం... బాణసంచా కాల్చడంపై నిషేధం...
కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి.
ఆరుబయట క్లాసులు.. చీరల మధ్య పాఠాలు: లెక్కల మాస్టారు ఐడియా: కర్నూలు జిల్లాలో కరోనా పీడ
యడియూరప్ప ఏమన్నారు...
శుక్రవారం ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ... బాణసంచా కాల్చడంపై అధికారులు,మంత్రులతో కలిసి చర్చించినట్లు చెప్పారు. కోవిడ్ 19ని దృష్టిలో ఉంచుకుని ఈసారి దీపావళికి బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ... బాణసంచా కారణంగా కరోనా పేషెంట్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి దీపావళి రోజు బాణసంచాకు దూరంగా ఉండాలని చెప్తున్నామన్నారు.
ఒడిశా,రాజస్తాన్లలో నిషేధం...
కర్ణాటక కన్నా ముందు ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ రాష్ట్రాలు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించాయి. ఈ నెల 14న దీపావళి, 30న కార్తీక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెల 10 నుంచి 30వతేదీ వరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించి బాణసంచా విక్రయించినా, కాల్చినా విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఢిల్లీ,ముంబైలోనూ...
అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని చెప్పింది. ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో సతమతమవుతోంది... ఒకటి కరోనా, మరొకటి వాయు కాలుష్యం... కాబట్టి ప్రజలు బాణసంచాకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కూడా బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తి,చలికాలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరింది.