బీజేపీ గేమ్ప్లాన్కు కాంగ్రెస్, జేడీఎస్ స్పీకర్తో విరుగుడు మంత్రం
బెంగళూరు : దక్షిణాదిలో పాగా వేయాలనేది బీజేపీ కల. అందుకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కర్ణాటక పీఠంపై తమ జెండా పాతాలని తహతహలాడుతుంది. సమయం చూసి దెబ్బకొట్టింది. కానీ బీజేపీ గేమ్ ప్లాన్ను జేడీఎస్, కాంగ్రెస్ పసిగట్టాయి. తమ సంజీవని అస్త్రం స్పీకర్ను ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కే ఆర్ రమేశ్ కర్ణాటక స్పీకర్గా తన చేతిలో ఉన్న విశేష అధికారాలను ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్యేలను ముంబైకి తరలించి .. అటు నుంచి గోవాకు తరలించినా .. కాంగ్రెస్, జేడీఎస్ ఇంత నిమ్మలంగా ఉండటానికి స్పీకరే కారణం.
అదనుచూసి ..
కర్ణాటక సీఎం కుమారస్వామి లేని సమయం చూసుకొని బీజేపీ పావులు కదిపింది. కాంగ్రెస్కు చెందిన 10 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించింది. దీంతో కర్ణాటక సంకీర్ణ సర్కార్ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అప్పటికే రంగంలోకి దిగిన కుమారస్వామి, పరమేశ్వర తదితరులు లోపల భయం ఉన్న కాస్త గంభీరంగానే కనిపించారు. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా అంటే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. కానీ వారి ధైర్యానికి కారణం స్పీకరే. తన విచక్షణ అధికారాలతో ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు. శనివారం రాజీనామా చేస్తున్నామని 13 మంది స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారికి అప్పుడు కే ఆర్ రమేశ్ షాకిచ్చారు. వారిని అక్కడే వెయిట్ చేయించారు తప్ప కలువలేదు. తర్వాత వారు ముంబైకి మకాం మారిన ఫలితం లేదు. రాజీనామా చేశామని చెప్తున్నారు .. కానీ ఆ రాజీనామా పత్రాలు తమకు చేరలేదని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.
క్యాంపులు వేసినా ...
రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నుంచి తమ మకాన్ని గోవాకు మార్చారు. వారు తాము క్యాంపు వేశామని చెప్తున్నారే తప్ప .. రాజీనామాల ఆమోదం మాత్రం పొందలేదు. దీనిపై ఇవాళ స్పీకర్ స్పందించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు తనకు అందలేదని తేల్చిచెప్పారు. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యే తనను విడిగా కలువాలని స్పష్టంచేశారు. వాస్తవానికి విడిగా కలిస్తే రాజీనామాకు గల కారణం స్పీకర్కు తెలియజేయాలి. వారు చెప్పే కారణంతో సభాపతి ఏకీభవిస్తే రాజీనామా ఆమోదిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. ఒకవేళ స్పీకర్ రాజీనామాను తిరస్కరిస్తే ఆ ఎమ్మెల్యేలు పదవీకి చేసిన రాజీనామా చెల్లుబాటు కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న రమేశ్ .. సంకీర్ణ సర్కార్ను కాపాడాలనే చూస్తారు. అందుకోసమే రెబల్ ఎమ్మెల్యేలకు కనిపించకుండా ఉంటున్నారు.
ఎత్తు చిత్తు ..
కన్నడనాట ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వేసిన ఎత్తుకు సంకీర్ణ సర్కార్ స్పీకర్తో విరుగుడ మంత్రం వేసింది. ఆ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే తదుపరి చర్య ఉంటుంది. లేదంటే అక్కడే బ్రేక్ పడినట్టే అవుతుంది. కానీ బీజేపీ తమకు స్పీకర్ రూపంలో గండిపడుతుందని ఊహించలేకపోయింది. అందుకే ఆచితూచి స్పందిస్తోంది. కర్ణాటక బీజేపీ చీప్ యడ్యూరప్ప నిన్న స్పందిస్తూ .. తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా చెప్పారు. కానీ రెండురోజులు వేచిచూస్తామని స్పష్టంచేశారు. అంటే ఎమ్మెల్యేలు క్యాంపులో ఎన్నిరోజులు ఉన్న ఫలితం లేదని అర్థమై ఉంటుంది. అందుకే తొందర పడకుండా స్పందిస్తోంది. ఇటు కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం వేగంగా అడుగులు వేస్తూ .. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుడుగు వేస్తుంది. తమ వద్ద ఉన్న స్పీకర్ అనే తారకమంత్రంతో ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఏర్పడ్డ అస్థిరతను కాపాడుకుంటు వస్తున్నాయి.