రూట్ మార్చిన కర్ణాటక బీజేపీ: గవర్నర్ కు ఫిర్యాదు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, సీఎంను కాపాడాలని ?
Recommended Video
బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విరామం తరువాత బీజేపీ నాయకులు కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాను కలిసి శాసన సభా సమావేశం జరిగిన తీరును వివరించిన తరువాత స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది.
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. అయితే శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, చర్చకు అవకాశం ఇచ్చారని బీజేపీ నాయకులు గవర్నర్ వాజూబాయ్ వాలాకు ఫిర్యాదు చేశారని తెలిసింది.
స్పీకర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు గవర్నర్ వాజూబాయ్ వాలాకు ఫిర్యాదు చేశారని సమాచారం. గురువారం సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ కు సూచించాలని బీజేపీ నాయకులు గవర్నర్ వాజూబాయ్ వాలాకు మనవి చేసి వినతి పత్రం అందించారు.
గవర్నర్ వాజూబాయ్ వాలాను తాము కలిశామని, సీఎం కుమారస్వామి ఇదే రోజు (గురువారం) అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు సూచించాలని మనవి చేశామని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మీడియాకు చెప్పారు. బీజేపీ నాయకులు జగదీష్ శెట్టర్, అరవింద్ లింబావలి, మాజీ స్పీకర్ కేసీ, బోపయ్య, బసవరాజ్ బోమ్మయ్, రవి తదితరులు గవర్నర్ ను కలిశారు.
బీజేపీ నాయకులు గవర్నర్ తో భేటీ అయిన తరువాత రాజ్ భవన్ నుంచి ప్రత్యేక అధికారి విధాన సౌధ చేరుకున్నారు. విధాన సౌధ చేరుకున్న ప్రత్యేక అధికారి గవర్నర్ ఆదేశాలను పాటిస్తున్నారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అని పరిశీలిస్తున్నారు.
స్పీకర్ ఏమైనా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా అంటూ ప్రత్యేక అధికారి గ్యాలరీలో కుర్చోని పరిశీలిస్తున్నారు. విధాన సౌధలో ఏం జరుగుతోంది, శాసన సభ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రత్యేక అధికారి ద్వారా ఎప్పటికప్పుడు గవర్నర్ వాజూబాయ్ వాలా తెలుసుకుంటున్నారని తెలిసింది. ఇదే సమయంలో స్పీకర్ అడ్వకేట్ జనరల్ తో పాటు న్యాయనిపుణలుతో చర్చిస్తున్నారు.