రైతుల రుణమాఫీ: యడ్యూరప్పను ఆహ్వానించిన సీఎం కుమారస్వామి, నేడు డిసైడ్, క్రెడిట్!
బెంగళూరు: రైతుల రుణమాఫీ విషయంలో అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్పను ఆహ్వానించారు. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్పను ఆహ్వానించి ఆయన సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ డిమాండ్
శాసన సభలో హెచ్.డి. కుమారస్వామి బలపరీక్ష నిరూపించుకునే సమయంలో రైతుల రుణమాఫీ చెయ్యాలని ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ చెయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు.
సీఎంకు చిక్కులు
రైతుల రుణమాఫీ విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ ఇరకాటంలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో రైతులకు హామీ ఇచ్చారు.
రూ. 58 వేల కోట్ల రుణం
కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోని రైతులు దాదాపు రూ. 58,000 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, కో-ఆపరేటీవ్ బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకున్నారు. ఒకే సారి రైతుల రుణాలు మాఫీ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారని సమాచారం.
కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విధాన సౌధలో జరుగుతున్న సమావేశంలో సీఎం. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ మంత్రి డీకే. శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప, రైతు సంఘం నాయకులు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటున్నారు.
బీజేపీ మాస్టర్ ప్లాన్
రైతుల రుణమాఫీ ఎలాగైనా చేయించాలని, ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రైతుల రుణమాఫీ చెయ్యడానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అంటున్నారు. అయితే కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బుధవారం మద్యాహ్నం లోపు తేలిపోతుంది.