మాజీ సీఎంతో బీజేపీ నాయకుల భేటీ, లోక్ సభ ఎన్నికలు టార్గెట్, ప్రచారానికి ఓకే, బెంగళూరు ఐటీ!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ఎం. కృష్ణతో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేయించాలని ఆ పార్టీ నాయకులు సిద్దం అయ్యారు. ఏప్రిల్ 18, ఏప్రిల్ 23వ తేదీల్లో రెండు విడతల్లో కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ బెంగళూరులోని సదాశివనగరలో ఉన్న ఎస్ఎం. కృష్ణ ఇంటికి సోమవారం (మార్చి 11వ తేదీ) చేరుకుని ఆయనతో సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల ప్రచారానికి రావాలని మనవి చేశారు.
మాజీ ప్రధాని ఫ్యామిలీ ప్యాకేజ్, తండ్రి, కొడుకులు, కొడలు, మనుమడు, ఏం మిగిలింది స్వామి!
బెంగళూరు ప్రజలు
ఆర్. అశోక్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఎం. కృష్ణ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరులో చేసిన అభివృద్ది పనులను ప్రజలు ఇంకా మరిచిపోలేదని, ముఖ్యంగా ఐటీ, బీటీ సంస్థల విషయంలో దేశంలోనే ఎక్కడా లేని విదంగా బెంగళూరును అభివృద్ది చేశానని ఎస్ఎం. కృష్ణ చెప్పారు. అందు వలనే తాను బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తానని ఎస్ఎం. కృష్ణ వివరించారు.
టార్గెట్ ఒక్కలిగ
ఒక్కలిగ కులస్తులు ఎక్కువగా ఉన్న బెంగళూరు నగర, తుమకూరు, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో ఎస్ఎం. కృష్ణ ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. అంతే కాకుండా ఎస్ఎం. కృష్ణ ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారం చెయ్యాలి అనే విషయంపై బీజేపీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు.
వ్యక్తి కాదు సిద్దాంతం ముఖ్యం
బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ పోటీ చేసే విషయంలో మాట్లాడిన ఎస్ఎం. కృష్ణ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదని అన్నారు. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదని, సిద్దాంతం ముఖ్యమని, తాము సిద్దాంతం ముందు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెలుతున్నామని ఎస్ఎం. కృష్ణ వివరించారు.
మోడీ ప్రధాని అభ్యర్థి
బెంగళూరు నగరంలోని మూడు లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ హవా ఎక్కువగా ఉందని ఎస్ఎం. కృష్ణ అన్నారు.నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదిశగా ఎన్నికల ప్రచారం చేస్తారని ఎస్ఎం. కృష్ణ చెప్పారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని ఎస్ఎం. కృష్ణ చెప్పారు.
మాజీ ప్రధాని, మాజీ సీఎం పోటీ ?
బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్బంలో తాను బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని ఎస్ఎం. కృష్ణ అంటున్నారు. బీజేపీ నాయకులు గెలుపు కోసం తాను ఎన్నికల ప్రచారం చేస్తానని మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ వివరించారు.