కర్ణాటకలో యూపీ ఫార్ములా? ముఖ్యమంత్రిగా కొత్త ముఖం? కేంద్ర కేబినెట్లో యడ్యూరప్ప?
న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా భారతీయ జనతాపార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. శాసనసభలో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తున్నందున.. భవిష్యత్తులో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, అసమ్మతి రాగం వినిపించకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఒకట్రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ ఫర్వాలేదని, పునాదులు మాత్రం బలంగా ఉండాలని భావిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన నేపథ్యంలో.. పాత కాపు బీఎస్ యడ్యూరప్పకే ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించాలా? వద్దా? అనే అంశం వద్ద ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కర్ణాటకకు చెందిన కొందరు సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది.
యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడం వల్ల లాభనష్టాలేంటీ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, సీనియర్ నేతలు బసవరాజ్ బొమ్మై, అరవింద్ లింబావళి, విజయేంద్ర, మధుస్వామిలతో పాటు మరికొందరు నేతలు గురువారం ఉదయం దేశ రాజధానిలో అడుగు పెట్టారు. ఆ వెంటనే వారు పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం జేపీ నడ్డాను కూడా కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వారికి వివరించారు. సుమారు గంటన్నర పాటు వారి మధ్య ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి మార్పు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకే ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అమిత్ షా బీజేపీ కర్ణాటక నేతలను గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మై తమ అభిప్రాయాలను వెల్లడించారని అంటున్నారు.
యడ్యూరప్పకు ప్రత్యామ్నాయం ఎవరు?
యడ్యూరప్పకు ప్రత్యామ్నాయ నేతను బీజేపీ అన్వేషిస్తోందనేది స్పష్టమైనట్లు తెలుస్తోంది. యడ్యూరప్పకు సరైన ప్రత్యామ్నాయం దొరక్కపోతే.. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టినట్టవుతుందనే వాదన కూడా వినిపిస్తుండటం గమనార్హం. ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్నే గనక ఎన్నుకోవాల్సి వస్తే.. యడ్యూరప్పకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని చెబుతున్నారు. కీలక పోర్ట్ ఫోలియోను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. యడ్యూరప్పకు ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించవచ్చనే విషయాన్ని కూడా అమిత్ షా, జేపీ నడ్డాలు జగదీష్ శెట్టర్ను అడిగి తెలుసుకున్నారు. యడ్యూరప్పను తప్పిస్తే.. ఆయన సామాజిక వర్గం ప్రజల నుంచి ఏదైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? అనే విషయంపైనా ఆరా తీసినట్లు సమాచారం.
ఉత్తర్ ప్రదేశ్ ఫార్ములా?
కర్ణాటకలో ఉత్తర్ ప్రదేశ్ ఫార్ములాను ప్రవేశపెట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర వర్ణాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించి, అనంతరం- రెండు లేదా అంతకుమించి ఉప ముఖ్యమంత్రి పదవులను బలహీన, దళిత వర్గాలకు చెందిన నేతలకు ఇవ్వాలనే దిశగా యోచిస్తున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక రాజకీయాల్లో చురుకుగా ఉండే మఠాధిపతుల పేర్లు కూడా ఓ దశలో పరిశీలినకు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా బీజేపీ బలంగా లేదు. సరైన ఓటు బ్యాంకు లేదు. క్షేత్రస్థాయిలో క్యాడరూ లేదు. ఈ నేపథ్యంలో- కర్ణాటకలో అంది వచ్చిన అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడని, ఈ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకుని దక్షిణాదిన పార్టీ కార్యకలాపాలను గ్రామస్థాయిలో తీసుకెళ్లి పటిష్ట పరచుకోవాలనే భావనలో ఉంది బీజేపీ. ఈ క్రమంలోనే- కొత్త వారికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
యడ్యూరప్ప ముందే జాగ్రత్త పడ్డారా?
ఈ విషయం ముందుగా తెలియడం వల్లే యడ్యూరప్ప జాగ్రత్త పడ్డారని అంటున్న వాళ్లూ లేకపోలేదు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కక పోవచ్చని చుచాయగా తెలుసుకున్న ఆయన.. హుటాహుటిన బెంగళూరు చామరాజపేటలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయానికి వెళ్లారు. సంఘ్ పరివార్ పెద్దలను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. సంఘ్ పరివార్ పెద్దల ఆశీర్వాదం లేనిదే ఏ పనీ అయ్యటట్టు లేదని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం ఆర్ఎస్ఎస్ నుంచే ఆరంభమైన విషయం తెలిసిందే.
3 గంటలకు మరో దఫా చర్చలు
జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మై, అరవింద్ లింబావళితో భేటీ సందర్భంగా- అమిత్ షా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశమౌదామని వారికి సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం మార్పు ఖాయమనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ప్రత్యామ్నాయం దొరికితే మాత్రం- ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్ని చూడొచ్చని చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి జరిగే సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశాలు లేకపోవచ్చనే అంటున్నారు కర్ణాటక బీజేపీ నాయకులు.