కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!
బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో వాటిని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి కారు డీకొనింది.
తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని ఉకేనహళ్ళి సమీపంలోని జాతీయ రహదారి 75లో మంగళవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 12 మంది యువకులు రెండు కార్లలో కర్ణాటకలో విహారయాత్రకు బయలుదేరారు.
మంగళవారం వేకువ జామున యువకులు రెండు కార్లు ఉకేనహళ్లి జాతీయ రహదారిలో రోడ్డు పక్కన నిలిపి మూత్రవిసర్జన చెయ్యడానికి నిలబడి ఉన్నారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఢీకొనింది.
ఈ ప్రమాదంలో శశికుమార్, సునీల్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సీటీ. రవికి చిన్నచిన్న గాయాలైనాయని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి పోలీసులకు సమాచారం ఇచ్చి తరువాత వేరే కారులో బెంగళూరు వెళ్లారని పోలీసులు అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి ప్రయాణిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి కారు అక్కడి నుంచి పక్కకు తొలగించారని ఆరోపణలు ఉన్నాయి.