బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి, తిప్పారెడ్డి దెబ్బ, నిప్పంటించి నిరసనలు, లాఠీచార్జ్, సీఎంకు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు అప్పుడే అసమ్మతి గళం విప్పుతున్నారు. తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని ఆరోపిస్తూ అనేక నియోజక వర్గాల్లో బీజేపీ కార్యకర్తలు అప్పుడే రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే జేహెచ్. తిప్పారెడ్డి మంత్రి పదవి రాలేదని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేహెచ్. తిప్పారెడ్డి దూరంగా ఉన్నారు. మంగళవారం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జేహెచ్. తిప్పారెడ్డి తనను కలిసిన మీడియాతో మాట్లాడారు.
వాజ్ పేయి, ఎల్ కే అద్వాణి, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తదితరులను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని బీజేపీ ఎమ్మెల్యే జేహెచ్. తిప్పారెడ్డి అన్నారు. అయితే మంగళవారం విడుదలైన మంత్రివర్గం జాబితా చూసిన తరువాత తాను షాక్ కు గురైనానని బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
యడియూరప్ప మంత్రివర్గంలో తనకు ఎందుకు చోటు దక్కలేదు అనే విషయం అర్థం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి విచారం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి అనుచరులు చిత్రదుర్గలోని గాంధీ సర్కిల్ లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
బీజేపీ కోసం ఇంత కాలం నీతినిజాయితీగా పని చేసిన మా నాయకుడు తిప్పారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బైక్ కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో చిత్రదుర్గలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న చిత్రదుర్గ జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.