రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ !
బళ్లారి/బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి క్యూలో సిద్దంగా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు బాంబు పేల్చారు. రాజీనామా చేసే ఎమ్మెల్యేల వివరాలు సంకీర్ణ ప్రభుత్వ పెద్దలకు తెలుసని శ్రీరాములు షాక్ ఇచ్చారు.
బళ్లారిలోని తన నివాసంలో శ్రీరాములు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాదవ్ తన పదవికి రాజీనామా చేసిన విషయంలో బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు మాట్లాడుతూ ఇప్పుడే ఏమి అయ్యింది, ముందు ఇంకా చాల కథ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్కలంగా ఉంది
సంకీర్ణ ప్రభుత్వం తీరుపై పలువురు ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని, త్వరలో వారు తమ ఎమ్మెల్యే పదువులకు రాజీనామా చేసే అవకాశం పుష్కలంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు అన్నారు. తాము ఎమ్మెల్యే పదవులకు కచ్చితంగా రాజీనామా చెయ్యాలని బళ్లారి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు నిర్ణయించారని శ్రీరాములు అన్నారు.
ప్రభుత్వానికి కష్టాలు
తమ ఎమ్మెల పదవులకు రాజీనామా చేస్తే సంకీర్ణ ప్రభుత్వానికి కష్టాలు ఎదురౌతాయని అసంతృప్తి ఎమ్మెల్యేలు వారి సన్నిహితులతో అన్నారని తనకు సమాచారం ఉందని బళ్లారి శ్రీరాములు అన్నారు. బళ్లారి జిల్లాలోనే ఎక్కువ మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంకీర్ణ ప్రభుత్వం
అసంతృప్తి ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వానికి కచ్చితంగా తలనొప్పి మొదలౌతుందని బళ్లారి శ్రీరాములు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేష్ గొడవ గురించి మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఇది వారి వ్యక్తిగత విషయం అని, తాము అందులో జోక్యం చేసుకోమని చెప్పారు.
ప్రభుత్వ పెద్దలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేష్ గొడవ గురించి ఎక్కువ ఆలోచించి తాము బుర్రపాడు చేసుకోమని శ్రీరాములు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కంప్లీ ఎమ్మెల్యే గణేష్ గొడవ గురించి సంకీర్ణ ప్రభుత్వం పెద్దలు పూర్తి వివరణ ఇస్తే బాగుంటుందని శ్రీరాములు అన్నారు.
నీచ రాజకీయాలు
సర్జికల్ స్ట్రైక్ 2 విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని బళ్లారి శ్రీరాములు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులపై యుద్దం మొదలు పెట్టారని, పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని శ్రీరాములు మనవి చేశారు.
ఇందిరా గాంధీ సాహస దుర్గా
ఇందిరా గాంధీ అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ మీద యుద్దం చేశారని, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వాజ్ పేయి ఇందిరా గాంధీని సాహస దుర్గా అంటూ అభినందించారని, ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని బళ్లారి శ్రీరాములు సూచించారు.