సీఎం కుమారస్వామి బలపరీక్ష: కర్ణాటకలో వెనక్కి తగ్గిన బీజేపీ, చివరి నిమిషయంలో నామినేషన్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ స్పీకర్ పదవి కోసం గురువారం నామినేషన్ సమర్పించిన బెంగళూరు నగరంలోని రాజాజీనగర శాసన సభ నియోజక వర్గం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.
ఇద్దరు కుమార్ లు
శుక్రవారం మద్యాహ్నం స్పీకర్ పదవి కోసం ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శ్రీనివాసపురం ఎమ్మెల్యే (కాంగ్రెస్) రమేష్ కుమార్, బీజేపీ నుంచి రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ పోటీలో ఉన్నారు.
చివరి నిమిషంలో రివర్స్
కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ కేజీ. బోపయ్య స్పీకర్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం అయ్యారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ సీనియర్ శాసన సభ్యుడు సురేష్ కుమార్ ఊహించని విధంగా తన నామినేషన్ పత్రాలను వెనక్కు తీసుకున్నారు.
సురేష్ కుమార్ క్లారిటీ
అన్ని పార్టీల ఆమోదంతో స్పీకర్ ఎంపిక జరుగుతుందని, బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను పోటీలో ఉండకూడదని నామినేషన్ పత్రాలు వెనక్కు తీసుకున్నానని సురేష్ కుమార్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సురేష్ కుమార్ నామినేషన్ పత్రాలు వెనక్కు తీసుకోవడంతో రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.