గాలి జనార్దన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్: ఇంత చులకనా, సారీ చెప్పిన రెడ్డి !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విమర్శించే సందర్బంలో ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేసిన ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తీరుపై బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో గాలి జనార్దన్ రెడ్డి సారీ చెప్పారు.
నోరుజారిన రెడ్డి
రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అని, అయితే ఇలాంటి సందర్బాల్లో వారి కుటుంబ సభ్యుల గురించి, వారి వ్యక్తిగత వ్యహారాలు ఎందుకు మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి నోరుజారారని అంటున్నారు.
జైలు శిక్ష పడింది
తాను నాలుగు సంవత్సరాలు జైలుకు వెళ్లడానికి కారణం అయిన సిద్దరామయ్య కారణం అని గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. అందుకే దేవుడు సిద్దరామయ్య కుమారుడు రాకేష్ కు చావు ఇచ్చి ఆయన్ను శిక్షించాడని గాలి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు
ఈ విషయంపై బుధవారం బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య తదితరులు మీడియాతో మాట్లాడుతూ గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. సిద్దరామయ్యను విమర్శించే సమయంలో ఆయన కుమారుడి వ్యవహారం ఎందుకు తీసుకురావాలని గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య తదితరులు ప్రశ్నించారు.
తప్పు చేశారు
సిద్దరామయ్య కుమారుడి వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి ఇలా మాట్లాడటం తప్పు అని బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే కాదు ఇలా ఎవరు మాట్లాడినా అది తప్పే అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య తదితరులు అంటున్నారు.
సారీ చెప్పిన గాలి
సిద్దరామయ్య వ్యహారంలో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడిన తీరుపై అనేక మంది ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం గాలి జనార్దన్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సిద్దరామయ్య వ్యవహారంలో తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే తనను క్షమించాలని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.