సీఎం సిద్దరామయ్య నరహంతకుడు, కాంగ్రెస్ పాపాలు పండిపోయాయి: కేంద్ర మంత్రి, ఎంపీ !
మంగళూరు/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నరహంతకుడు అని దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. కర్ణాటకలో పులి, చిరుత, సింహాలను చూశాము, నరహంతకుడు వీరప్పన్ ఆగడాలను చూశాం, అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులపైకి ఎవరైనా నరహంతకుడు ఉన్నారా అంటే ఒక్క సిద్దరామయ్య మాత్రమే అని, కాంగ్రెస్ పాపాలు పండిపోయాయని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ విమర్శించారు. మంగళవారం మంగళూరు సమీపంలోని కోళాయి ప్రాంతంలో జనసురక్షా యాత్ర బహిరంగ సభలో బీజేపీ నాయకులు మాట్లాడారు.
ప్రభుత్వం పాపాలు
కర్ణాటకలో ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య పాపాల ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య పాపాలు పండిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోతుందని, తరువాత మనకు అన్నీ మంచిరోజులే వస్తాయని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చెప్పారు.
సీఎంకు కాంగ్రెస్ చాన్స్ ఇవ్వదు
సిద్దరామయ్య మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి కాలేరని, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆచాన్స్ ఆయనకు ఇవ్వరని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే జోస్యం చెప్పారు. సిద్దరామయ్య లాంటి అవినీతి ముఖ్యమంత్రి, కిరాతకుడిని తాను జీవితంలో చూడలేదని మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మండిపడ్డారు.
హిందూవులకు భద్రత ఎక్కడ
బీజేపీతో సహ హిందూ సంఘ, సంస్థల్లో పని చేస్తున్న యవకులకు భద్రత లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన హిందూ యువకులు రాత్రి ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకమే లేదని, అలాంటి చేతకాని ప్రభుత్వం ఉందని ఎద్దేవ చేశారు.
హత్యల ప్రభుత్వం
సీఎంగా సిద్దరామయ్య భాద్యతలు చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకూ కర్ణాటకలో 24 మంది హిందూ సంఘ, సంస్థల నాయకులు, కార్యకర్తలు దారుణ హత్యకు గురైనారని కార్కాళ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు.
ఒక్కడి దగ్గర 7 రివాల్వర్లు
బెంగళూరులోని శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీక్ కొడుకు మహమ్మద్ నలపాడ్ దగ్గర 7 రివాల్వర్లు ఉన్నాయని, అక్రమ ఆయుధాల చట్టం కింద అతని మీద ఎందుకు కేసులు నమోదు చెయ్యలేదని పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులు పని చేస్తున్నారా ?
పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, కాంగ్రెస్ చెప్పినట్లు చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీపని మీరు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని, మీ విధులలో జోక్యం చేసుకోమని బీజేపీ నాయకులు పోలీసులకు హామీ ఇచ్చారు.