సీఎంకు చివాట్లు పెట్టిన బీజేపీ మహిళా ఎంపీ, ధైర్యం ఉంటే గోవాలో, చాలెంజ్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కావాలనే రైతులను రెచ్చగొట్టించి తమ కార్యాలయం ముందు ధర్నా చెయ్యాలని చెప్పారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఉడిపి-చిక్కమగళూరు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ శోభా కరందాజ్లే ఆరోపించారు. సీఎంకు గోవాలోని సొంత పార్టీ పెద్దలతో మాట్లాడే సత్తా లేకపోవడంతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడాలని ఆమె సవాలు విసిరారు.
కేపీసీసీ కార్యాలయం
మహాదాయి తాగునీటి ప్రాజెక్టు విషయంలో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
సీఎంకు సవాలు !
బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీ ప్రభుత్వానికి చేతనైతే గోవాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి మహాదాయి తాగు నీటి ప్రాజెక్టుకు అడ్డుపడకుండా చూడాలని ఆమె సవాలు చేశారు.
పోలీసులతో బెదిరిస్తున్నారు !
మహాదాయి తాగునీటి ప్రాజెక్టు కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తుంటే సీఎం సిద్దరామయ్య పోలీసులను రెచ్చగొట్టించి రైతులు, ప్రజలను భయపెడుతున్నారని, లాఠీలతో కొట్టిస్తున్నారని ఎంపీ శోభా కరందాజ్లే ఆరోపించారు.
గోవా నాయకుల కోసం !
తాగునీటి కోసం ప్రజలు ఆందోళన చేస్తుంటే గోవాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారని లోక్ సభ సభ్యురాలు శోభా కరందాజ్లే ఆరోపించారు.
మంత్రి ఎందుకు రాలేదు !
మహాదాయి తాగు నీటి ప్రాజెక్టు కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే కేపీసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావ్, మంత్రి ఎంబీ. పాటిల్ ఇక్కడికి ఎందుకు రాలేదని శోభా కరందాజ్లే ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన ఎంపీ శోభా కరందాజ్లేతో సహ బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేసి బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.