కేంద్ర మంత్రి సదానందగౌడకు మాజీ సీఎం యడ్యూరప్ప షరతులు, కన్నడిగులు !
న్యూఢిల్లీ: కర్ణాటక నుంచి కేంద్ర మంత్రిగా డివి. సదానందగౌడ పదవి స్వీకారం చేశారు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు డివి. సదానందగౌడ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం బీజేపీ చీఫ్ అమిత్ షా డివి. సదానందగౌడకు ఫోన్ చేసి మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలని సూచించారు.
ఢిల్లీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్పతో డివి. సదానందగౌడ భేటీ అయ్యి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. డివి. సదానందగౌడను ఆశీర్వదించే సమయంలో బీఎస్. యడ్యూరప్ప షరతులు విదించారని తెలిసింది.
తన ఆప్తమిత్రుడు అనంతకుమార్ ను గుర్తు చేసుకున్న బీఎస్ యడ్యూరప్ప కొంత ఉద్వేగానికి గురైనారు. అనంతకుమార్ లాగా మంచి పేరుతెచ్చుకుని కేంద్ర మంత్రిగా గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇవ్వాలని బీఎస్ యడ్యూరప్ప డివి. సదానందగౌడకు షరతు విదించారని తెలిసింది.
అనంతకుమార్ లాగా మంచి పేరు తెచ్చకుని కన్నడిగుల సమస్యలు పరిష్కరించడానికి ఢిల్లీలో పోరాటం చేస్తానని సదానందగదౌడ బీఎస్ యడ్యూరప్పకు మాట ఇచ్చారని తెలిసింది. కన్నడిగుల కోసం పోరాటం చేస్తూ కేంద్ర మంత్రిగా పని చేసిన అనంతకుమార్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఒక్కలిగ వర్గంలో సదానందగౌడకు మంత్రి పదవి దక్కింది. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీకి 25 ఎంపీ స్థానాలు దక్కాయి. కర్ణాటక నుంచి నలుగురు కేంద్ర మంత్రులు అవుతున్నారు. డివి. సదానందగౌడతో పాటు ప్రహ్లాద్ జోషి, సురేష్ అంగడి, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పదవులు చేపడుతున్నారు.