బీజేపీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం, కర్ణాటక బడ్జెట్ సమావేశాలు, సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ !
బెంగళూరు: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అత్యవసరంగా బీజేపీ శాసన సభ్యుల సమావేశం నిర్వహించడానికి సిద్దం అయ్యారు. ఈ నేపధ్యంలోనే పలువురు బీజేపీ జాతీయ నాయకులు సైతం కర్ణాటకకు రావడంతో తీవ్రచర్చకు దారి తీసింది.
బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మద్యాహ్నం 3.30 గంటలకు జరిగే సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని బీఎస్. యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం కోర్ కమిటీ సమావేశం జరగనుందని బీజేపీ నాయకులు అంటున్నారు.
కర్ణాటకలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించడం తీవ్రచర్చకు దారితీసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ సైతం బెంగళూరు చేరుకున్నారు.
కర్ణాటకలో ఆపరేషన్ కమల జోరు అందుకున్న సమయంలో బీజేపీ శాసన సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీ శాసన సభ్యులు మళ్లీ రిసార్టు రాజకీయాలు చేస్తారా ? అని చర్చ మొదలైయ్యింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు అయిన రామ్ లాల్ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించ నున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మైసూరులో జరిగే సుత్తూరు జాత్రకు హాజరు కావలసి ఉంది. అయితే బీఎస్. యడ్యూరప్ప తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.