మన కులం వాళ్లు కాంగ్రెస్ ఓట్లు వేస్తే నేరం, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, ఈసీ ఫిర్యాదు చేస్తాం !
బెంగళూరు: లింగాయుత కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నేరం అవుతందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ ఉప ఎన్నికల పోలింగ్ నాలుగు రోజుల్లో జరగనున్న సమయంలో మాజీ సీఎం యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కర్ణాటకలోని కుందగోళ్, చించోళి శాసన సభ నియోజక వర్గాల్లో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కలబురిగి చించోళి శాసన సభ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప లింగాయుత కులస్తుల నాయకులతో మాట్లాడారు.
లింగాయుత కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది నేరం అవుతందని, మన వర్గం వారు జాగ్రత్తగా ఉండాలని మాజీ సీఎం య్యూరప్ప సూచించారని సమాచారం. కుందగోళ్, చించోళి శాసన సభ నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో లింగాయుత కులస్తుల ఓట్లు ఉన్నాయి.
చించోళి శాసన సభ నియోజక వర్గంలోనే దాదాపు 45 వేల ఓట్లుకు పైగా లింగాయుత కులస్తుల ఓట్లు ఉన్నాయి. నాలుగు రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో మాజీ సీఎం లింగాయుతులు కాంగ్రెస్ కు ఓటు వేస్తే నేరం అవుతుందని వ్యాఖ్యలు చెయ్యడంతో వివాదానికి కారణం అయ్యింది.
మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు. చించోళి శాసన సభ నియోజక వర్గంలో లింగాయుత కులస్తులతో సమావేశం ఏర్పాటు చెయ్యడానకి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్దం అయ్యింది.
చించోళి నియోజక వర్గంలో జరిగే లింగాయుత కులస్తుల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, హోం శాఖా మంత్రి ఎంబీ. పాటిల్, కేపీసీసీ కార్యనిర్వహాక అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే తదితరులు హాజరు అవుతారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇలాంటి సమయంలో బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలతో మాట్లాడిన మాజీ సీఎం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.