సీఎంను చిక్కుల్లో పడేసిన పుల్వామా కామెంట్స్ ! రెండేళ్ల ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు ?
బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి తనకు రెండు సంవత్సరాల క్రితమే తెలుసని వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఉగ్రదాడి గురించి తెలిసినా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీఎం కుమారస్వామి మీద కేసు నమోదు అయ్యింది.
బహిరంగ సభలో !
ఫిబ్రవరి 14వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 45 మంది సైనికుల ప్రాణాలు పోయాయి. పుల్వామాలో ఉగ్రదాడి జరుగుతుందని తనకు రెండు సంవత్సరాల క్రితమే తెలుసని, ఒక మాజీ సైనికాధికారి ఒకర తనకు అప్పుడే చెప్పారని ఏఫ్రిల్ 5వ తేది చిక్కమగళూరులోని కోప్పలో జరిగిన బహిరంగ సభా సమావేశంలో సీఎం కుమారస్వామి అన్నారు.
తెలిసినా చెప్పలేదు
పూల్వామాలో ఉగ్రదాడి జరుగుతుందని సీఎం కుమారస్వామికి ముందుగా తెలిసినా అధికారులకు చెప్పకపోవడంతో 45 మంది అమాయకులైన సైనికుల ప్రాణాలు పోయాయని ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. 45 మంది సైనికుల ప్రాణాలు పోవడానికి సీఎం కుమారస్వామి పరోక్షంగా కారణం అయ్యారని ఫిర్యాదులో తెలిపారు. సీఎం కుమారస్వామి బహిరంగ సభలో మాట్లాడిన సీడీలను విధాన సౌధ పోలీసులకు అప్పగించారు.
మాటలు మార్చారు
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కుమారస్వామి అన్నారు. ఒక మాజీ సైనికాధికారి చెప్పిన మాటలు తాను చెప్పానని సీఎం కుమారస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ తో గొడవలు పెట్టుకుంటారని మాజీ సైనికాధికారి అన్నారని, పుల్వామా ఉగ్రదాడి గురించి తనకు ఏమి తెలుసు అని సీఎం కుమారస్వామి అంటున్నారు.
పాకిస్తాన్ తో ఢీ !
ఓట్లు సంపాదించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఎత్తులు వేస్తారని, ఎన్నికల సమయంలో అవసరం అయితే పాకిస్తాన్ తో ఢీకొట్టడానికి సిద్దం అవుతారని రెండు సంవత్సరాల క్రితం మాజీ సైనికాధికారి తనతో అన్నారని తాను చెప్పానని సీఎం కుమారస్వామి అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత అది నిజం అయ్యిందని సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు.