సంక్రాంతి షాక్: కర్ణాటక ప్రభుత్వానికి దిగులు, ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు, మోడీ, అమిత్ షా!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఛలో ఢిల్లీ అంటున్నారు.
జనవరి 13వ తేదీ బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి రావాలని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
ఈ విషయంపై బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ఎమ్మెల్యేలు సన్మానిస్తారని అన్నారు. అందుకే బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ వెలుతున్నారని మీడియాకు చెప్పారు. అయితే బీజేపీ నాయకుల ప్లాన్ వేరే ఉందని సమాచారం.
అయితే ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల ఢిల్లీ టూర్ రసవత్తరంగా మారిపోయింది.
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పదేపదే మీడియాకు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వానికి ఎలాంటి చిక్కులు లేవని, ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటామని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ధీమాగా అంటున్నారు.