వికేంద్రీకరణ బాటలో కర్ణాటక సర్కార్: బెంగళూరు నుంచి ఏకంగా 10 కమిషనరేట్లు, మండళ్లు తరలింపు..!
బెంగళూరు: కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. ఒకటి కాదు. రెండు కాదు.. వివిధ శాఖలకు చెందిన 10 కమిషనర్ కార్యాలయాలు, మండళ్లను బెంగళూరు నుంచి తరలించడానికి పచ్చజెండా ఊపింది. ఉత్తర కర్ణాటకలోని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. దీనికోసం తాజాగా ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది యడియూరప్ప సర్కార్. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, కలబురగి, ధార్వాడ వంటి జిల్లాల్లో ఆయా కమిషనర్ కార్యాలయాలు, మండళ్లు ఏర్పాటు కానున్నాయి.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్కు లేఖ..!
జార్కండ్, ఏపీల్లో కొత్త రాజధానులు..
ఉత్తర కర్ణాటక ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జార్ఖండ్లో నాలుగు, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ కూడా ఆ జాబితాలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బెళగావిలో సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఇక తాజాగా కమిషనర్ కార్యాలయాలను తరలించడానికి ఏర్పాట్లను చేపట్టింది.
2018 నాటి ప్రక్రియకు మోక్షం..
నిజానికి- ఇది పాత ప్రక్రియే. రాజధాని బెంగళూరు నుంచి కొన్ని ప్రధాన శాఖలకు సంబంధించిన కమిషనర్ కార్యాలయాలను ఉత్తర కర్ణాటక జిల్లాలకు తరలించడానికి 2018 డిసెంబర్లో అప్పటి హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. ఆయన సారథ్యంలోని మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలియజేసింది. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. అది కార్యరూపం దాల్చలేదు.
ప్రభుత్వ మార్పడి వల్ల జాప్యం..
కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల మధ్య కమిషనర్ కార్యాలయాలను తరలింపులో జాప్యం చోటు చేసుకుంది. తాజాగా ఎంపిక చేసిన ఆ 10 కమిషనర్ కార్యాలయాలను తరలిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కృష్ణా భాగ్య జల మండలి ఆలమట్టిలో ఏర్పాటు కానుంది. దావణగెరెలో కర్ణాటక నీరావరి మండలిని నెలకొల్పనున్నారు.
ఉత్తర కర్ణాటక జిల్లాల అభివృద్ధి కోసమే..
జౌళి అభివృద్ధి మండలి, చక్కెర, చెరకు అభివృద్ధి కమిషనర్ కార్యాలయాలను బెళగావికి తరలించనున్నారు. ఆర్కియాలజీ, మ్యూజియం, పురావస్తు సంగ్రహణ డైరెక్టర్ కార్యాలయాన్ని చారిత్రాత్మక, ప్రముఖ పర్యాటక కేంద్రం హంపిలో ఏర్పాటు చేయనున్నారు.కర్ణాటక పట్టణ మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలిని హుబ్బళ్లికి తరలించనున్నారు. ఈ మండలిని రెండుగా విభజించింది ప్రభుత్వం.
Recommended Video
పట్టణ మంచినీటి సరఫరా మండలిని విభజించి మరీ..
ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకల కోసం ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసింది. బెంగళూరు నగరానికి సంబంధించిన విభాగాన్ని కూడా రాజధానిలోనే కొనసాగిస్తారు. దక్షిణ కర్ణాటక పట్టణ మంచినీటి సరఫరా కార్యాలయం కూడా బెంగళూరులోనే కొనసాగుతుంది. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు ధార్వాడలో ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని కలబురికి తరలిస్తారు.