కర్ణాటక బడ్జెట్ సమావేశం, బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్, ఎమ్మెల్యేల మద్దతు లేదు, సీఎం కుమారస్వామి !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసుకుంటున్న హెచ్.డి. కుమారస్వామి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభా సమవేశాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ సమావేశం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వెళ్లిపోయారు.
శుక్రవారం ముఖ్యంత్రి కుమారస్వామి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో వేల్ లోకి దూసుకువెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి శాసన సభ్యుల సంపూర్ణ మద్దతు లేదని నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను శాంతియుతంగా ఉండాలని స్పీకర్ రమేష్ కుమార్ మనవి చేశారు.
బీజేపీ నాయకులు మాత్రం వేల్ లో ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకుల ధర్నా చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
శాసన సభ సమావేశాలను వాకౌట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు విధాన సౌధ ముందు భాగంలో ఉన్న కెంగల్ హనుమంతయ్య విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా సీఎం కుమారస్వామి ఎలా బడ్జెట్ ప్రవేశపెడుతారు అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సొంత పార్టీ శాసన సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని, సిగ్గు లేకుండా సీఎం కుమారస్వామి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.