కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభం: యడ్డీ సర్కార్ నిలబడాలంటే.. కనీసం ఏడు
బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. బృహన్ బెంగళూరు పరిధిలోని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా మొత్తం 15 చోట్ల ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 9వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్- జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం వారందరూ అధికార భారతీయ జనతా పార్టీలో చేరారు.
Recommended Video
రేపు ఉప ఎన్నికల పోలింగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సినిమా చూపించిన ఐటీ శాఖ, డబ్బు, మద్యం ? !
పోలింగ్ కొనసాగుతున్న నియోజకవర్గాలివే..
బెంగళూరు పరిధిలోని హొస్కొటే, యశ్వంత్ పురా, శివాజీ నగర, కృష్ణరాజ పుర, మహాలక్ష్మి లేఅవుట్ లతో పాటు గోకక్, అథణి, కగ్వాడ, విజయనగర, హిరేకరూరు, రాణి బెన్నూరు, యల్లాపుర, చిక్ బళ్లాపుర, హుణసూరు, కృష్ణరాజ పేటేలల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 4,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో 461, అత్యల్పంగా శివాజీ నగర పరిధిలో 193 పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. బెంగళూరు సిటీ పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్ రాజరాజేశ్వరి నగరతో పాటు మస్కిలల్లో ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఈవీఎంలో సాంకేతిక లోపాలు ఉన్నా..
అథణి నియోజకవర్గం 99వ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడినట్లు సమాచారం అందింది. వాటిని సరి చేయడానికి నియమించిన సాంకేతిక నిపుణులు యుద్ధ ప్రాతిపదికన వాటిని సరి చేశారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ కొనసాగుతోంది. అథణి బీజేపీ అభ్యర్థి మహేష్ కుమటళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే..
ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం ఏడు స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సభ్యుల సంఖ్య 112కు చేరుతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటేనే యడియూరప్ప సర్కార్ మనుగడ కొనసాగిస్తుంది. అత్యధికక స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకోగలిగితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆ కూటమికి దక్కుతుంది.