Karnataka: దున్నేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కు కౌంటింగ్ కష్టాలు, సీఎం కుర్చీ సేఫ్ ?, అయోమయంలో అప్ప !
బెంగళూరు/ తుమకూరు/ న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారంలో ఉన్న సీఎం బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి ఉప ఎన్నికలు అగ్నిపరీక్షలుగా మారాయి. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర, తుమకూరు జిల్లాలోని శిరా ఉప ఎన్నికల కౌంటింగ్ జోరుగా జరుగుతోంది. ఆర్ఆర్ నగర, శిరాలో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తే సీఎం యడియూరప్ప సీటు సేఫ్, లేదంటే ఆయన కుర్చీకి ఎసరు వచ్చే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థి మునిరత్న 14, 784 ఓట్ల మెజారిటీతో దున్నేస్తున్నారు. శిరాలో 1, 7007 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోంది. అయితే రెండు చోట్ల కాంగ్రెస్ కు కౌంటింగ్ ఫలితాలతో కష్టాలు ఎదురౌతున్నాయి.
Recommended Video
khiladi officer: ఒక్క ఉద్యోగం, రూ. 250 కోట్ల ఆస్తులు, స్వప్న ఆంటీ వేస్ట్, సుధా మేడమ్ చూస్తేనే!
ఆర్ఆర్ నగర్ లో కురుక్షేత్రం
బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరినగర్)లో జరిగిన ఉప ఎన్నికలో తామే కచ్చితంగా గెలుస్తామని అధికార బీజేపీ అభ్యర్థి, ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే కురుక్షేత్రం ఫేమ్ మునిరత్న ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దివంగత ఐఏఎస్ అధికారి డీకే. రవి సతీమణి కుసుమా సైతం తాను కచ్చితంగా గెలిచి ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు.
బీజేపీ దూకుడు
ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు జోరుగా జరుగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఐదు రౌండ్ల ఫలితాలను అధికారులు వెళ్లడించారు. బీజేపీ అభ్యర్థి మునిరత్నకు 15, 110 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కుసుమాకు 8, 692 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి క్రిష్ణమూర్తికి 2, 344 ఓట్లు వచ్చాయి. అన్ని రౌండ్లు కలిపితే బీజేపీ అభ్యర్థి మునిరత్న 14, 784 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తన సత్తా చాటుకోవాలని మునిరత్న చెయ్యని ప్రయత్నాలు లేవని చెప్పాలి.
శిరాలో నువ్వానేనా
తుమకూరు జిల్లాలోని శిరా శాసన సభ ఉప ఎన్నికల కౌంటింగ్ తుమకూరులోని పాలిటెక్నిక్ కాలేజ్ లో కట్టుదిట్టమైన భద్రతలో జరుగుతోంది. శిరాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2. 15 లక్షల మంది. శిరా ఉప ఎన్నికల్లో మొత్తం 1, 77, 645 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శిరా శాసన సభ నియోజక వర్గంలో అధికార పార్టీ బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. శిరాలో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అంటూ పోటీపడ్డాయి.
దూసుకుపోతున్న బీజేపీ.... కట్టడి చెయ్యలేని కాంగ్రెస్
శిరా శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ నుంచి రాజేష్ గౌడ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి టీబీ. జయచంద్ర, జేడీఎస్ పార్టీ నుంచి అమ్మాజమ్మ పోటీ చేశారు. మంగళవారం ఉదయం 9.45 గంటలకు అధికారులు మూడవ రౌండ్ ఫలితాలు వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడకు 6, 436 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి టీబీ. జయచంద్రకు 4, 729 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి అమ్మాజమ్మకు 2, 714 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడ 1, 707 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ అభ్యర్థి టీబీ. జయచంద్ర ఆయన్ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది.
సీఎంకు చావుబతుకుల సమస్య
కర్ణాటకలో రెండు అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు జరిగాయి. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే సీఎం బీఎస్. యడియూరప్ప అనేక ప్రయత్నాలు చేశారు. ఆర్ఆర్ నగర్, శిరా ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తే బీఎస్. యడియూరప్ప కుర్చీ సేఫ్ అని, లేదంటే ఆయన సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని కొందరు బీజేపీ నాయకులే అంటున్నారు. కొన్ని గంటల్లో కర్ణాటక రాజకీయ ముఖచిత్రం రూపురేఖలు ఎలా ఉంటాయో ? అనే విషయం వెలుగు చూడనుంది.