సినిమా చూపిస్తున్న బీజేపీ రెబల్స్, రూ. వెయ్యి కోట్ల ఆస్తి ఆసామికి వణుకు, సీఎం ధీమా, డెడ్ లైన్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమై అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. 17 మంది అనర్హత ఎమ్మెల్యేల్లో 13 మంది ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటికే 16 మంది అనర్హత ఎమ్మెల్యేలు అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రూ. వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉన్న ఆసామి ఎంటీబీ. నాగరాజ్ కు బీజేపీ రెబల్ అభ్యర్థి, యువ నాయకుడు శరత్ బచ్చేగౌడ వణుకు పుట్టిస్తున్నాడు. అనేక నియోజక వర్గాల్లో బీజేపీ రెబల్స్ ఆ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు.
బళ్లారి రాజకీయాలకు మంత్రి శ్రీరాములు గుడ్ బై ?, నిన్న గాలి జనార్దన్ రెడ్డి, నేడు, సీఎం !
సీఎం యడియూరప్ప హామీ
అనుకున్నట్లుగానే 13 మంది అనర్హత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మిమ్మల్ని గెలిపించుకునే భాద్యత మాదే అంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించే భాద్యతను సీఎం యడియూరప్ప మంత్రులతో పాటు అనేక మంది స్థానిక బీజేపీ నేతలకు అప్పగించారు.
రూ. 1,000 కోట్ల ఆసామికి వణుకు !
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంతో ఇంత కాలం అదే పార్టీలో ఉన్న నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిక్కబళ్లాపురం బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బచ్చేగౌడ కుమారుడు శరత్ బచ్చేగౌడ హోసకోటేలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వెయ్యడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. హోసకోటే నియోజక వర్గం నుంచి అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంటీబీ. నాగరాజ్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే రూ. 1, 000 కోట్లకు పైగా ఆస్తి ఉన్న ఎంటీబీ నాగరాజ్ మాత్రం శరత్ బచ్చేగౌడ దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. శరత్ బచ్చేగౌడ దెబ్బతో ఎక్కడ తనకు ఓటమి ఎదురౌతుందో అంటూ ఎంటీబీ నాగరాజ్ ఆందోళన చెందుతున్నారు.
బీజేపీలో అసమ్మతి సెగ
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కాగె ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. అశోక్ పూజారి, బెంగళూరులోని శివాజీ నగర్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ వెయ్యడానికి సిద్దం కావడంతో బీజేపీ నాయకులు ఆందోళనకు గురైనారు. ఇక స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించకపోతే మా పరిస్థితి ఏమిటని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అనర్హత ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెడ్ లైన్ తో ఆందోళన
కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి ఈనెల 18వ తేదీ చివరి రోజు. అంతలోపు సొంత పార్టీ మీద అసమ్మతితో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని సీఎం యడియూరప్ప బుజ్జగిస్తారని బీజేపీ నాయకులు అనర్హత ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్నారు. అయితే సీఎం యడియూరప్ప బుజ్జగింపులు ఎంత వరకు ఫలిస్తాయో అంటూ అనర్హత ఎమ్మెల్యేలు ఆందోళనతోనే ఉన్నారు.
రెంటికీ చెడిన రోషన్ బేగ్ !
బెంగళూరు నగరంలోని శివాజీనగర నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ పరిస్థితి మారీ దారుణంగా తయారైయ్యింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ను నోటికి వచ్చినట్లు విమర్శించిన రోషన్ బేగ్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఐఏంఏ స్కాంలో రోషన్ బేగ్ చిక్కుకోవడంతో ఆయన్ను బీజేపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో గురువారం బీజేపీలో చేరిన ఎం. శరవణకు శివాజీనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో రోషన్ బేగ్ షాక్ కు గురైనారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి రోషన్ బేగ్ సిద్దం అవుతున్నారు.
బీజేపీ అభ్యర్థులు వీరే, టిక్కెట్లు ఖరారు
* కేఆర్ పురం (బెంగళూరు) - భైరతి బసవరాజ్
* యశవంతపుర (బెంగళూరు)- ఎస్.టి. సోమశేఖర్
* శివాజీనగర (బెంగళూరు)- ఎం. శరవణ
* మహాలక్ష్మి లేఔట్ (బెంగళూరు(- కే. గోపాలయ్య
* హోసకోటే (బెంగళూరు గ్రామీణ)- ఎంటీబీ నాగరాజ్
* చిక్కబళ్లాపురం- డాక్టర్ సుధాకర్
* హణసూరు- హెచ్. విశ్వనాథ్
* కృష్ణరాజపేట్- కేసీ. నారాయణగౌడ
* విజయనగర (బళ్లారి) - ఆనంద్ సింగ్
* హీరేకరూరు- బి.సి. పాటిల్
* యల్లాపుర- శివరాం హెబ్బార్
* గోకాక్- రమేష్ జారకిహోళి
* కాగవాడ- శ్రీమంత్ పాటిల్
* అథణి- హమేష్ కుమటళ్ళి