కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీకి సర్వే షాక్, నోరు జారితే ఫినిష్, సీఎం సీటుకే ఎసరు, ఢిల్లీ పెద్దలు!
బెంగళూరు: కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీ జరగనున్న 15 నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా తామే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 15 శాసన సభ నియోజక వర్గాల్లో జరిగిన సులభ సంస్థ సర్వే ఫలితాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సహకరించి నేడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను మనం ఎలా గెలిపించుకోవాలి ? అంటూ బీజేపీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. సర్వే ఫలితాలు బయటకు రావడంతో ఇక లాభం లేదని, స్వయంగా తానే రంగంలోకి దిగి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటానని సీఎం బీఎస్. యడియూరప్ప తన సన్నిహితుల దగ్గర చాలెంజ్ చేశారని తెలిసింది.
డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!
గెలుపు అంత సులభం కాదు సుమా!
కర్ణాటకలో కచ్చితంగా 8 నుంచి 10 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు ఇంత కాలం ధీమాగా ఉన్నారు. అయితే గోకాక్, హణసూరు, హోస్ కోటే, రాణేబెన్నూరు, కేఆర్ పేట్, చిక్కబళ్లాపురం, యశవంతపుర (బెంగళూరు) నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం అంత సులభం కాదని సర్వే తెలిపింది. ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కావాలంటే కచ్చితంగా ఉప ఎన్నికల్లో అధిక నియోజక వర్గాల్లో విజయం సాధించాలి.
సీఎం సీటుకే ఎసరు?
ఉప ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో విజయం సాధించలేకపోతే సీఎం యడియూరప్ప సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యడియూరప్ప ఆయన కుల పెద్దలతో పాటు, అనేక మఠాల మఠాధిపతులతో ఈ విషయంపై చర్చలు జరిపారని, వారి మద్దతు కోరుతున్నారని తెలిసింది, అథణి, కాగవాడ, గోకాక్ నియోజక వర్గాల్లో మనం విజయం సాధించకపోతే పరిస్థితులు చాల దారుణంగా ఉంటాయని ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది, సీనియర్ మంత్రి జగదీష్ శెట్టర్ లను సీఎం యడియూరప్ప పరోక్షంగా హెచ్చరించారని తెలిసింది.
హోం మంత్రి అక్కడే మకాం
రాణేబెన్నూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు అప్పగించడంతో ఆయన అక్కడే మకాం వేశారు. హో మంత్రితో పాటు బీజేపీ సీనియర్ నేత మురగేశ్ నిరాణి సైతం ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు. సీఎం కుమారుడు బీవై. రాఘవేంద్రకు హీరేకరూరు, సీనియర్ మంత్రి ఆర్. అశోక్ కు బెంగళూరు నగరంలోని యశవంతపుర నియోజక వర్గం, మంత్రి సీటీ రవికి చిక్కబళాపురం, హోస్ కోటే నియోజక వర్గాలు, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ నారాయణకు కేఆర్ పురం నియోజక వర్గం అప్పగించారు.
రంగంలోకి దిగిన బీఎల్ సంతోష్
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం యడియూరప్పతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ రంగంలోకి దిగారు. డిసెంబర్ 3వ తేదీ వరకు ఉప ఎన్నికల ప్రచారం చెయ్యాలని సీఎం యడియూరప్ప, సంతోష్ నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీని ఎలాంటి పరిస్థితుల్లో ఆ చాన్స్ మిస్ చేసుకోరాదని బీజేపీ హైకమాండ్ సూచించిందని తెలిసింది. ఇంత కాలం కర్ణాటక రాజకీయాలను తెర వెనుక నుంచి నడిపిన బీఎల్. సంతోష్ ఈ ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
విమర్శలు చేస్తే ఫినిష్!
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎక్కువ ప్రాధానత్య ఇవ్వాలని, మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్.డీ. కుమారస్వామిలను నోటికి వచ్చినట్లు దూషించడం మనకు అంత మంచిదికాదని స్థానిక బీజేపీ నాయకులకు హై కమాండ్ సూచించిందని తెలిసింది. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తే ఓట్లు రావని, స్థానికులను మచ్చిక చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకులకు హై కమాండ్ ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది.
సులభ సర్వే షాక్!
సులభ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉప ఎన్నికల్లో బీజేపీ ఆరు నియోజక వర్గాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. కనీసం 12 నియోజక వర్గాల్లో ఎలాగైనా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.