నిమిష నిమిషానికి మారుతున్న ట్రెండ్స్.. బీజేపీకి 11, కాంగ్రెస్ 2 చోట్ల, యడ్డీ సర్కార్కు ఊరటే..
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలో ట్రెండ్ నిమిష నిమిషానికి మారుతోంది. 15 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగగా.. 10 నుంచి 11 చోట్ల బీజేపీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ ఒక చోట లీడ్లో ఉంది. యశ్వంత్పురలో మాత్రం జేడీఎస్-బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దీంతో యడియూరప్ప సర్కార్ ఊరట కలిగే అవకాశం ఉంది. యడ్డీ ప్రభుత్వం నిలువాలంటే ఆరు నుంచి 8 సభ్యులు గెలిస్తే చాలు. కానీ ఆ పార్టీ 11 చోట్ల దూసుకెళ్తుండటంతో.. బీజేపీ ప్రభుత్వం మెజార్టీ మార్క్ దాటనుంది.
బీజేపీకి 11..
చిక్ బళ్లపూర్, యెల్లపూర్లో బీజేపీ అభ్యర్థులు, శివాజీనగర్, హస్నూర్లో కాంగ్రెస్, కేఆర్ పేటలో జేడీఎస్ లీడ్లో కొనసాగుతున్నారు. మహలక్ష్మీ లేఅవుట్, విజయ్ నగర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హోస్కోట్ స్వతంత్ర అభ్యర్థి ఎస్కే బచ్చేగౌడ లీడ్లో ఉన్నారు. యెల్లాపూర్లో ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి శివరాం హెబ్బర్ లీడ్, 10,716 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయనకు సమీపంలో ఇతర పార్టీ అభ్యర్థులు లేకపోవడంతో విజయం ఖాయమనే చెప్పాలి.
మారుతున్న యశ్వంత్పూర్ ట్రెండ్
యశ్వంత్పూర్లో మాత్రం ట్రెండ్ మారుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి జేడీఎస్ అభ్యర్థి 8130 ఓట్ల ముందంజ, కాంగ్రెస్ అభ్యర్థికి 458 ఓట్లు, బీజేపీ క్యాండెట్కు 4909 ఓట్లు వచ్చాయి. 2091 ఓట్లతో జేడీఎస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థికి 13760 ఓట్లు రాగా, బీజేపీ క్యాండెట్కు 11699 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 1059 ఓట్లు, నోటాకు 213 ఓట్లు వచ్చాయి.
బీజేపీ అభ్యర్థుల లీడ్
గోకాక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి 12365 ఓట్లు, విజయనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆనంద్ సింగ్ లీడ్లో ఉన్నారు. మహాలక్ష్మీ లేఔట్లో బీజేపీ అభ్యర్థి కే గోపలయ్య ముందంజలో ఉన్నారు. కాగ్వాడ్లో బీజేపీ అభ్యర్థి లీడ్, యెల్లపూర్లో బీజేపీ అభ్యర్థి 16,961 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోకాక్లో 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
105 మంది సభ్యులతో
కర్ణాటకలో బీజేపీకి 105 సభ్యులు ఉన్నారు. అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్య 225 కాగా.. 15 మందిపై అనర్హత వేటు పడింది. దీంతో సభ్యుల సంఖ్య 210కి చేరింది. 105 సభ్యులు గల బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ఎన్నికల్లో కనీసం 6 నుంచి 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిస్తే.. యడియూరప్ప ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోతోంది. లేదంటే మళ్లీ కర్ణాటకలో అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. కానీ లీడ్ చూస్తే బీజేపీ అభ్యర్థులు 11 చోట్ల ఉన్నారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం మెజార్టీ మార్క్ దాటే అవకాశం ఉంది.