యెల్లపూర్లో బీజేపీ బోణి, ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామన్న డీకే శివకుమార్
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్ క్షణ క్షణానికి మారుతోంది. బీజేపీ 12 చోట్ల లీడ్లోకి వచ్చింది. కాంగ్రెస్ శివాజీనగర్, హన్సూర్లో లీడ్లో ఉండగా.. హొస్కొట్లో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. జేడీఎస్ పార్టీ యశ్వంత్పూర్లో ప్రభావం చూపింది. ఇక్కడ బీజేపీ-జేడీఎస్ అభ్యర్థుల మధ్య స్వల్ప ఆధిక్యం కొనసాగుతోంది. జేడీఎస్ క్యాండెట్ 96 ఓట్లతో ఉంది.
బీజేపీ బోణీ
ఉప ఎన్నికల తొలి ఫలితం వెల్లడైంది. యెల్లపూర్లో బీజేపీ విజయబావుటా ఎగరేసింది. దీంతో శివరాం హెబ్బర్ అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. ఐదో రౌండ్ ముగిసేసరికి శివరాం హెబ్బర్..10,716 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఆయనకు సమీపంలో కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు లేకపోవడం విశేషం. దీంతో బీజేపీ ఖాతాలో తొలి విజయం చేరింది. మిగతా 11 చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు.
శిరసావహిస్తా
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీ కేవలం రెండుచోట్ల మాత్రమే ప్రభావం చూపడంపై రియాక్టైంది. ఉప ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలకు ఫిరాయింపుదారులకే మద్దతిచ్చారని పేర్కొన్నారు. దానిని ఆమోదిస్తున్నామని శివకుమార్ తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతో తాము నిరుత్సాప పడటం లేదన్నారు.
105 మంది సభ్యులు
కర్ణాటకలో బీజేపీకి 105 సభ్యులు ఉన్నారు. అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్య 225 కాగా.. 15 మందిపై అనర్హత వేటు పడింది. దీంతో సభ్యుల సంఖ్య 210కి చేరింది. 105 సభ్యులు గల బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ఎన్నికల్లో కనీసం 6 నుంచి 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిస్తే.. యడియూరప్ప ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోతోంది. లేదంటే మళ్లీ కర్ణాటకలో అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. కానీ లీడ్ చూస్తే బీజేపీ అభ్యర్థులు 12 చోట్ల ఉన్నారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం మెజార్టీ మార్క్ దాటే అవకాశం ఉంది.