యడ్డీ సర్కార్ సేఫ్, 12 చోట్ల ఆధిక్యం, నిజమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు..
కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. కర్ణాటక అసెంబ్లీకి 225 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.. బీజేపీకి 105 మంది సభ్యులు ఉన్నారు. మరో 8 మంది సభ్యులు ఉంటే చాలు.. కానీ 12 మంది సభ్యులు గెలవనుండటంతో ఆ పార్టీకి తిరుగులేకుండా పోతోంది.
113 సభ్యులు కావాల్సి ఉండగా.. బీజేపీ 117 సభ్యులతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలవనుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్ ఒకచోట, జేడీఎస్ ఒకచోట ముందంజలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్,జేడీఎస్ పార్టీకి చెందిన 12 మంది సభ్యులపై అనర్హత వేటు పడటంతో ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. 12 మంది అసమ్మతి నేతలు బీజేపీలో చేరి, ఆ పార్టీ నుంచి పోటీచేశారు. ఉప ఎన్నికల్లో లింగాయత్ ఓటర్లు ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 12 సీట్లలో బీజేపీ లీడ్లో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇటు సీఎం యడియూరప్ప కూడా ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లారు. అంతకుముందు తన తండ్రికి విజయేంద్ర మిఠాయి తినిపించారు.
కర్ణాటక ఉప ఎన్నికల్లో తాము మెజార్టీ సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తాయని అంచనా వేశాయి. లెక్కగట్టినట్టే బీజేపీ సభ్యులు 12 సీట్లలో విజయ దుందుభి మోగించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆనంద డోలికల్లో మునిగిపోయాయి.