షాక్: కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి విద్యార్హత 8వ తరగతి, గోవిందా గోవిందా, ట్వీట్టర్ వార్ !
బెంగళూరు: దేవుడా కలికాలం అంటే ఇదేనేమో అంటున్నారు పలువురు కన్నడిగులు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. దేశంలో రాష్ట్రంలో అత్యుత్తమ విద్యాసంస్థలు ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. అయితే కర్ణాటకలో ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయకుడి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్న కన్నడిగులు షాక్ కు గురైనారు. ఆయన కేవలం 8వ తరగతి చదివారని, ఉన్నత విద్యాశాఖ మంత్రి అయ్యారని తెలుసుకున్న ప్రజలు గోవిందా గోవిందా అంటూ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దరామయ్య దెబ్బ
2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా మైసూరు జిల్లా చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో అప్పటి సీఎం హోదాలో పోటీ చేసిన సిద్దరామయ్యను జేడీఎస్ నాయకుడు జీటీ. దేవేగౌడ 35,000 ఓట్లకు పైగా తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
జేడీఎస్ బహుమానం
సిద్దరామయ్య మీద మొదటి నుంచి వ్యక్తిగతంగా, రాజకీయంగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్.డి. కుమారస్వామికి మండిపడుతూ వస్తున్నారు. అలాంటి సిద్దరామయ్యను చిత్తుగా ఓడించిన జేటీ. దేవేగౌడకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, సీఎం హెచ్.డి. కుమారస్వామి ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవిని బహుమానంగా ఇచ్చారా ? అని కన్నడిగులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల అఫిడవిట్
చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి జీటీ. దేవేగౌడ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జీటీ దేవేగౌడ నామినేషనప్ పత్రాల్లో తాను 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని స్పష్టంగా వివరించారు. విద్యార్హత లేని వ్యక్తికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవి కాకుండా మరే పదవి ఇవ్వడానికి అవకాశం లేదా అంటూ సంకీర్ణ ప్రభుత్వాన్ని కన్నడిగులు నిలదీస్తున్నారు.
90వ దశాబ్దం గ్యారెంటి
జీటీ. దేవేగౌడ ఉన్నత విద్యాశాఖ మంత్రినా ? అవునా ? నిజమా ? ఎలా సాధ్యం అయ్యింది ? అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జీటీ. దేవేగౌడ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కొనసాగితే కర్ణాటక కచ్చితంగా 90వ దశాబ్దంలోకి వెళ్లిపోతుందని పలువురు ట్వీట్టర్ లో జోకులు వేస్తున్నారు.
డిగ్రీ మంత్రికి ఈ మంత్రికి తేడా
డిగ్రీ చదివి మంత్రి అయిన వ్యక్తికి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారని, 8వ తరగతి చదివిన మంత్రి జీటీ దేవేగౌడకు ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారని, ఇక విద్యార్థులు జీవితాలు ఏమైతాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. విద్యార్హతను చూసి మంత్రి పదవులు ఇవ్వాలని, కులాలను చూసికాదని పలువు కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.