కర్ణాటక మంత్రివర్గ సమావేశం, గవర్నర్ జోక్యం చేసుకుంటే ? సీఎం రాజీనామా, కథ కంచికి !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలో గురువారం మంత్రి వర్గ సమావేశం జరగనుంది. బెంగళూరులోని విధానసౌధలో ఉదయం 11 గంటలకు సీఎం కుమారస్వామి నేతృత్వంలో జరిగే మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ జోక్యం చేసుకోకముందే స్వచ్చందంగా రాజీనామా చెయ్యాలని సీఎం కుమారస్వామి ఆలోచిస్తున్నారని తెలిసింది.
రాజకీయ సంక్షోభం
ప్రస్తుతం కర్ణాటకలో నేలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జరుగుతున్న మంత్రి వర్గ సమావేశంలో సీఎం కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంత్రులు అందరూ రాజీనామా చేశారు. అయినా సీఎం ఆద్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.
రాజీనామా లేఖలు
కాంగ్రెస్ మంత్రులు రాజీనామా పత్రాలను సిద్దరామయ్యకు, జేడీఎస్ మంత్రులు సీఎం కుమారస్వామికి రాజీనామా లేఖలు అందించారు. అయితే వారి రాజీనామాలు ఇంత వరకు ఆమోదించలేదు. రాజీనామాలు అమోదించకపోవడంతో చాల మంది మంత్రులు ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
సీఎం రాజీనామా ?
మంత్రివర్గ సమావేశం తరువాత సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో వారి అభిప్రాయాలు తీసుకున్న తరువాత సీఎం కుమారస్వామి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయ్యా ఇది పరిస్థితి
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులామ్ నబి ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ తదితరులు చర్చించిన తరువాత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, సీఎం కుమారస్వామితో భేటీ అయ్యి పరిస్థితి వివరించారు.
గవర్నర్ జోక్యం
16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పరిస్థితి ఇప్పటికే చెయ్యిదాటిపోయింది. గురువారం జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో సీఎం కుమారస్వామి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశం తరువాత గవర్నర్ జోక్యం చేసుకోకముందే తానే స్వచ్చందంగా రాజీనామా చెయ్యాలని సీఎం కుమారస్వామి ఆలోచిస్తున్నారని సమాచారం.