'కేబినెట్'పై నేడే తుది నిర్ణయం: జేడీఎస్ నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు?..
బెంగళూరు: ఎట్టకేలకు కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మంత్రి పదవులపై అవగాహన కుదిరినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో ఇరు పార్టీల నేతలు జరిపిన మంతనాలు ఓ కొలిక్కి రావడంతో.. పదవులపై సందిగ్ధం వీడినట్టే అంటున్నారు. కీలక శాఖలుగా భావిస్తున్న ఆర్థికం, హోంశాఖలను చెరొకటి పంచుకోవడానికి అంగీకారం కుదరినట్టు తెలుస్తోంది.
కుదిరిన అంగీకారం:
రెండు పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో సాగించిన పలు దఫాల చర్చల్లో పదవుల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక మంత్రి పదవి జేడీఎస్కు, హోం శాఖ కాంగ్రెస్కు ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. సోనియా గాంధీ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన రాహుల్.. అక్కడినుంచే నేతలతో ఫోన్ లో చర్చించినట్టు సమాచారం.
నేడు బెంగళూరులో చర్చలు
పదవుల కేటాయింపుపై రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. అయితే, తుది నిర్ణయం తీసుకోబోయే ముందు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ బెంగళూరు వెళ్లి తమ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది.
ఇదే విషయంపై జేడీఎస్ నేత డానిష్ అలీ మాట్లాడుతూ.. 'మా పార్టీకి ఆర్థిక శాఖ ఇవ్వాలని అంగీకారం కుదిరింది. దీనిపై బెంగళూరు వెళ్లి సీఎంతోపాటు పార్టీ అధినేత దేవెగౌడతో మాట్లాడి ఖరారు చేస్తాం' అని తెలిపారు.
శుక్రవారం అధికారికంగా వెల్లడిస్తాం: కుమారస్వామి
మంత్రి పదవులపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో.. శుక్రవారం ఆ వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని సీఎం కుమారస్వామి చెప్పారు. అంతకంటే ముందు జేడీఎస్ అధినేత దేవెగౌడ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లతో ఢిల్లీ మంతనాలపై చర్చలు జరుపుతామన్నారు. అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఆర్థికశాఖను జేడీఎస్ వద్ద పెట్టుకోవడంపై కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.
జేడీఎస్ నుంచి ఎవరెవరికి
తమ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలన్న దానిపై కూడా కుమారస్వామి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం సీఎం పదవితో కలిపి జేడీఎస్కు 12 మంత్రి స్థానాలు దక్కుతాయి. కుమారస్వామి మినహా మిగతా 11 మంత్రి పదవులకు ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై బుధవారం జేడీఎస్ పార్టీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది.
ఇందులో ఆరుగురి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కుమారస్వామి సోదరుడు హెచ్.డి.రేవణ్ణ, హెచ్.విశ్వనాథ్, జి.టి.దేవెగౌడ, సి.ఎస్.పుట్టరాజు, బండెప్ప కాశెంపుర, బసవరాజ హొరట్టిలకు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మిగతా 5 మంత్రి స్థానాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తారని తెలుస్తోంది.