యడియూరప్ప మంత్రివర్గం: ఢిల్లీలో డిసైడ్, అనర్హత ఎమ్మెల్యేలకు చాన్స్, రెండు విడతలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప తన మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేపడుతారు ? అంటూ రాజకీయ వర్గాల్తో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆగస్గు 5వ తేదీ తరువాతే ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేస్తారని సమాచారం. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అనర్హత ఎమ్మెల్యేల్లో కనీసం 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని యడియూరప్ప నిర్ణయించారని సమాచారం. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలని అనే విషయం ఢిల్లీలో డిసైడ్ చేస్తారని తెలిసింది.
అనర్హత ఎమ్మెల్యేలకు చాన్స్
రెండు విడతల్లో యడియూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపడుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొదటి విడతో 10 మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడానికి సీఎం యడియూరప్ప సిద్దం అయ్యారని తెలిసింది. రెండో విడతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారని సమాచారం.
క్యూలో 50 మంది ఎమ్మెల్యేలు
బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఇవ్వాలని కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధర్ రావ్ కు సూచించారు. అనర్హతకు గురైన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో సహ మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారని సమాచారం.
ఢిల్లీలో డిసైడ్
మంత్రి పదవులు ఆశిస్తున్న 50 మంది ఎమ్మెల్యేల పేర్లు ఢిల్లీకి పంపించారు. ఆగస్టు 5వ తేదీ సీఎం యడియూరప్ప ఢిల్లీ వెలుతున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహ హైకమాండ్ తో సీఎం యడియూరప్ప మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయం చర్చించనున్నారు.
యడియూరప్ప వర్గీయులు
మంత్రి వర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి అనే విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్నది. ఇలాంటి సమయంలో సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు వస్తాయా ? లేదా ? అనే విషయం అంతుచిక్కడం లేదు.
ఎవరికి చాన్స్ వస్తుందో ?
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అనర్హత ఎమ్మెల్యేల్లో కనీసం 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేల విషయం కోర్టులో ఉంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుని రెండవ విడతలో మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చెయ్యాలని యడియూరప్ప నిర్ణయించారని తెలిసింది. శాసన సభ్యులతో పాటు ఎమ్ ఎల్ సీలు కోటా శ్రీనివాస పూజారి, ఆయనూరు మంజునాథ్, ఎన్. రవి కుమార్ లు మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు.