New Year 2021: ఈ ఒక్కరోజు ఏం పొడిచేస్తారు ? మా మాటవినండి ఫ్రెండ్స్, సీఎం, తేడా వస్తే, చూస్తారు ?
బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి బెంగళూరు వచ్చిన వారిలో చాలా మందికి కొత్తరకం స్ట్రెయిన్ కరోనా వైరస్ ఉందని వెలుగు చూసిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇదే సమయంలో 2021 నూతన సంవత్సరం వేడుకలకు చాలా మంది సిద్దం కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గురువారం అర్దరాత్రి 12 గంటల నుంచి అమలు చేసిన కర్ఫ్యూను గురువారం మద్యాహ్నం 12 గంటల నుంచి అమలు చెయ్యాలని, ప్రజలు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మనవి చేశారు. ఈ ఒక్కరోజులో ఏం పొడిచేస్తారు ? మామాట వినండి, తేడా వస్తే పోలీసులు మీ కథ చూస్తారు అంటూ సీఎం పరోక్షంగా యువతను హెచ్చరించారు.
ఒక్కరోజులో ఏం వస్తుంది ?
కొత్త సంవత్సరం వేడుకలు అంటూ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి హంగామా చేసినంత మాత్రనా ఎవ్వరికి ఏమీ ఒరిగేది ఏమీ ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సాటి మనుషుల ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలని, కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.
మా మాట వినండి ఫ్రెండ్స్
న్యూఇయర్ వేడుకలు ఈ రోజే జరుపుకోవాలని యువత ఆలోచించకూడదని, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలని సీఎం. బీఎస్. యడియూరప్ప అన్నారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి 2021 జనవరి 1వ తేదీ రాత్రి వరకు మీరు జల్సాలు చెయ్యాలని ప్లాన్ వేసుకోవడం కాదని, సాటి మనుషుల గురించి యువత ఆలోచించాలని, బెంగళూరులోని సాటి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని సీఎం. బీఎస్. యడియూరప్ప మనవి చేశారు.
పోలీసులకు ఆదేశాలు
డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ప్రజలు అందరూ పోలీసులకు సహకరించాలని సీఎం. బీఎస్. యడియూరప్ప మనవి చేశారు. బెంగళూరు ప్రజలు ఈ ఒక్కరోజు ప్రభుత్వానికి సహకరించాలని, అలా కాదని నూతన సంవత్సర వేడుకలు అంటూ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం బీఎస్. యడియూరప్ప పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందు జాగ్రత్త
డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం యువకులు రోడ్ల మీదకు వస్తే తరువాత కంట్రోల్ చెయ్యడం కష్టం అని భావించిన పోలీసులు గురువారం మద్యాహ్నం 12 గంటల నుంచి రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరుగుతున్నవారిని అడ్డుకుంటున్నారు. స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప రంగంలోకి దిగి గురవారం మద్యాహ్నం 12 గంటల నుంచే 144 సెక్షన్ అమలు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో బెంగళూరులో పోలీసులు అప్పుడే రంగంలోకి దిగారు. మొత్తం మీద గురువారం సాయంత్రం నుంచి యువకులు రోడ్ల మీదకు రాకుండా బెంగళూరు పోలీసు అధికారులు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు.