ఢిల్లీలో డిసైడ్ చేశారు, కర్ణాటక మంత్రివర్గం ఇదే, సీఎంకు చివరి నిమిషంలో, అసమ్మతి!
బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గం ఏర్పాటు అయ్యింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూబాయ్ వాలా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు రాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు సీఎం యడియూరప్ప నచ్చ చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసిన 25 రోజుల తరువాత మంత్రి వర్గం ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో డిసైడ్ చేసిన అమిత్ షా
బీఎస్. యడియూరప్ప మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో అనే విషయం చివరి వరకు రహస్యంగానే పెట్టారు. చివరికి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సైతం ఆయన మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో అనే విషయం తెలీదు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయం సోమవారం అర్దరాత్రి డిసైడ్ చేసి ఆ జాబితాను యడియూరప్పకు పంపించారు.
అప్ప మంత్రివర్గం ఇదే
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ శెట్టర్, బళ్లారి శ్రీరాములు, బెంగళూరులోని మల్లేశ్వరం ఎమ్మెల్యే డాక్టర్ అశ్వథ్ నారాయణ, ముధోళ శాసన సభ్యుడు గోవింద కారజోళ, లక్ష్మణ సంగప్ప సవది, కేఎస్, ఈశ్వరప్ప, బెంగళూరులోని పద్మనాభనగర్ ఎమ్మెల్యే ఆర్. అశోక్, సురేష్ కుమార్, జేసీ. మధూస్వామి, వి. సోమణ్ణ, సీటీ. రవి, బసవరాజ్ బోమ్మాయ్, కోటా శ్రీనివాస పూజారి, సీసీ. పాటిల్, చంద్రకాంత్ గౌడ, శశికళ జోళ్ళ, ప్రభు చౌహన్, చన్నప్ప గౌడ పాటిల్, స్వాతంత్ర పార్టీ ఎమ్మెల్యే (ముళబాగిల్) నాగేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సీనియర్లు అసహనం
హుక్కేరి శాసన సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే ఉమేష్ కత్తికి మత్రి పదవి దక్కలేదు. తనను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ సంగప్ప సవదికి మంత్రి పదవి ఇచ్చారని, 8 సార్లు తాను ఎమ్మెల్యే అయ్యానని, అయినా మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి ఉమేష్ కత్తి మీడియా ముందు అసహనం వ్యక్తం చేశారు.
నచ్చ చెప్పిన సీఎం
మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నచ్చచెప్పారు. మరో విడత మంత్రివర్గ విస్తరణలో మీకు కచ్చితంగా అవకాశం వస్తుందని, వేచి ఉండాలని సీఎం ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
నరేంద్ర మోడీ, అమిత్ షా !
యడియూరప్ప మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే విషయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలి అనే విషయం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. అసమ్మతి లేకుండా చూసుకోవాలని సీఎం యడియూరప్పకు అమిత్ షా సూచించారు.