అటవి ప్రాంతంలో మూడు రోజులు సీఎం ఫ్యామిలీ, భారీ బందోబస్తు, వైద్యులు, మంత్రులు!
బెంగళూరు: అధికారిక పర్యటనలు, రాజకీయ ఒత్తిడిలు, ఉప ఎన్నికల ప్రచారంతో తీరికలేకుండా గడిపిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మూడు రోజులు అన్ని అధికారిక పర్యటనలు రద్దు చేసుకుని కుటుంబ సభ్యలుతో కలిసి అటవి ప్రాంతంలోని రిసార్టులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాచనగరి మైసూరు జిల్లాలోని హెచ్.డి. కోటే తాలుకాలోని దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న కబిని ఆరెంజ్ కౌంటి రిసార్టులో సీఎం హెచ్.డి. కుమారస్వామి, ఆయన సతీమణి, రామనగర శాసన సభ్యురాలు అనితా కుమారస్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు.
అటవి ప్రాంతంలోని రిసార్టులో సీఎం. కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామిని వైద్యులు పత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న రిసార్టులో సీఎం కుమారస్వామి కుటుంబ సభ్యులు బసచేసిన సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కుమారస్వామి పర్యటనలో భాగంగా కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సా.రా. మహేష్, మైసూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జీటీ. దేవేగౌడ అనేక మంది జేడీఎస్ నాయకులు కబిని ఆరెంజ్ రిసార్టుకు వెళ్లారు. శనివారం సీఎం కుమారస్వామి కుటుంబ సభ్యులు నాగరహోళే అటవి ప్రాంతంలో సఫారికి వెళ్లే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు తెలిపాయి.
సీఎం కుమారస్వామి కుమారుడు, బహుబాష నటుడు, జాగ్వార్ సినిమా హీరో నిఖిల్ గౌడ కారాపుర జంగిల్ రిసార్టులో బసచేశారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి రాజకీయ ఒత్తిడి కారణంగా అన్ని అధికార కార్యక్రమాలకు దూరంగా మూడు రోజుల పాటు అటవి ప్రాంతంలోని రిసార్టులో బస చేస్తున్నారు.