ఈసీతో భేటీ: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి, అదే కారణం !
బెంగళూరు: విపక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దం అయిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. ఎన్నికల ఫలితాల సర్వేలు విడుదలైన తరువాత ఖరారైన సీఎం తన పర్యటన ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు.
ఈవీఎంలు, వీవీప్యాట్ కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి విపక్షాలు సిద్దం అయ్యాయి. ఎన్నికల కమిషన్ ను భేటీ కావడానికి సీఎం కుమారస్వామి సిద్దం అయ్యారు. ఉదయం 11 గంటల సమయానికి సీఎం కుమారస్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది.
అయితే ఒక్కసారిగా సీఎం కుమారస్వామి పర్యటన రద్దు అయ్యింది. సీఎం కుమారస్వామి ఢిల్లీ పర్యటన రద్దు కావడానికి సరైన కారణాలు మాత్రం వెలుగుచూడలేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ లలోని దోషాల గురించి ఎన్నికల కమిషన్ తో చర్చించడానికి 21 విపక్షాలు సిద్దం అయ్యాయి.
విపక్ష నాయకుల్తో సీఎం కుమారస్వామి ఉన్నారు. కేంద్రంలో ఎన్ డీఏ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పడం, కర్ణాటకలో కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు ఎక్కువ కావడంతో అయోమయంలో పడిన సీఎం కుమారస్వామి ఇక్కడే ఏదో ఒకటి తేల్చుకోవడానికి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం.
ఆదివారం సాయంత్రి విడుదైన సర్వేలు 122 సీట్లు మాత్రమే విపక్షాలకు వస్తాయని స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఆశ పెట్టుకున్న విపక్షాల మీద సర్వేలు నీళ్లు చల్లాయి. ఈ సర్వేలను బెంగల్ సీఎం మమతా బెనర్జీతె పాటు అనేక మంది నాయకులు తిరస్కరించారు.