రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?
జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ లో జరిగిన భారీ ర్యాలిలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీద ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలాంటి లీడర్స్ మనకు అవసరమా అని ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక ప్రజలను ప్రశ్నించారు.
జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి తండ్రి గతంలో ప్రధాని అయ్యారని ప్రధాని మోడీ చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి సైనికులను కించపరిచే విదంగా మాట్లాడారని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా కుమారస్వామి పేరు చెప్పకుండానే ఆయన మీద విరుచుకుపడ్డారు.
రెండు పూటల అన్నం కోసం ఎదురు చూసేవారు, కడుపు నింపుకోవడం కోసం ఆశ పడేవారు మాత్రమే సైన్యంలో చేరుతారని కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. రాజస్థాన్ ప్రజలు కర్ణాటక ముఖ్యమంత్రి అన్న మాటలను సమర్థిస్తారా అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
సైనికులను కించపరిచే ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరే సరైన బుద్ది చెప్పాలని రాజస్థాన్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు. రాజస్థాన్ నుంచి కొన్ని వేల మంది సైన్యంలో చేరారని, దేశ సరిహద్దుల నుంచి దేశ ప్రజలను వారు కాపాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైనికులను కించపరిచిన కర్ణాటక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.