పదో తరగతి కూడా చదవని కుర్రాడు.. అమెజాన్ను రూ.కోట్లలో ముంచేశాడు!
బెంగళూరు: పదో తరగతి కూడా పూర్తిగా చదవకుండా మధ్యలోనే మానేసి.. ఓ కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ కుర్రాడు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్నే బోల్తా కొట్టించాడు. జస్ట్ అయిదు నెలల్లో ఏకంగా రూ.1.3 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు.
వివరాల్లోకి వెళితే.. చిక్మగళూరులోని ఏకదంత కొరియర్ కంపెనీతో అమెజాన్ ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్కు సంబంధించిన ఆర్డర్ల డెలివరీతోపాటు నగదు కలెక్షన్ కూడా ఈ సంస్థే చేస్తోంది. దర్శన్ అలియాస్ ధ్రువ (25) ఇదే కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.
సెప్టెంబరు 2017 - ఫిబ్రవరి 2018 మధ్య కాలంలో చిక్మగళూరు నుంచి అమెజాన్ మొత్తం 4,604 ఆర్డర్లను అందుకుంది. దర్శన్ తన స్నేహితులతో కలిసి వీటిని ఆర్డర్ చేసేవాడు. అవి చిక్మగళూరులో దర్శన్ పనిచేస్తున్న కొరియర్ కంపెనీకే చేరేవి. మళ్లీ వాటిని అతడే తన స్నేహితులతో కలిసి డెలివరీ చేసేవాడు.
కార్డ్ పేమెంట్ సిస్టంను ట్యాంపర్ చేయడం ద్వారా దర్శన్, అతడి స్నేహితులు ఈ మోసానికి పాల్పడ్డారు. కార్డు స్వైప్ చేసినప్పుడు పేమెంట్ అయినట్టుగా తప్పుడు మెసేజ్ వచ్చేట్టు సృష్టించాడు. అయితే గత నెలలో అమెజాన్ నిర్వహించిన త్రైమాసిక ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసింది.
కంపెనీ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఇప్పటి వరకు దర్శన్ సహా నలుగురు యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.25 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 21 ఖరీదైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ఐపాడ్, ఆపిల్ వాచ్, నాలుగు బైక్లు ఉన్నాయి. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ అన్నామలై తెలిపారు.