రాజ్ భవన్ కు స్పీకర్ కు ఆహ్వానం, చివరికి అవమానం, ఘాటుగా సీఎస్ కు లేఖ, సీఎం జోక్యం !
బెంగళూరు: కర్ణాటక మంత్రి వర్గం విస్తరణ సమయంలో ఆ రాష్ట్ర స్పీకర్ రమేష్ కుమార్ కు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సీరియస్ అయ్యారు. వెంటనే స్పీకర్ రమేష్ కుమార్ కు జరిగిన అవమానంపై ఆయనతో మాట్లాడి సర్దిచెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యర్శి కె. రత్నప్రభకు సీఎం కుమారస్వామి సూచించారు.
గురువారం ఉదయం సీఎం కుమారస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభతో చర్చించారు. స్పీకర్ రమేష్ కుమార్ కు జరిగిన అవమానంపై ఆయనతో మాట్లాడి నచ్చచెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన మంత్రి వర్గం విస్తరణ కార్యక్రమానికి స్పీకర్ రమేష్ కుమార్ ను ఆహ్వానించడంతో ఆయన అక్కడికి వెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది, పోలీసులు స్పీకర్ రమేష్ కుమార్ ను లోపలికి అనుమతించకుండా అవమానించారు. సుమారు అర్దగంట వరకే అక్కడే వేచి ఉన్న స్పీకర్ రమేష్ కుమార్ తరువాత అక్కడి నుంచి విధాన సౌధకు వెళ్లిపోయారు.
రాజ్ భవన్ కు రావాలని మీరు ఆహ్వానించడం వలనే తాను వచ్చానని, అయితే లోపలికి వెళ్లడానికి అక్కడి పోలీసులు, అధికారులు అనుమతి ఇవ్వకుండా దురహంకారంతో ప్రవర్తించారని, ఇలాంటి అధికారులకు అడ్డుకట్ట వెయ్యకపోతే ప్రభుత్వానికి, చట్టానికి అవమానం అని స్పీకర్ రమేష్ కుమార్ ఘాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు లేఖ రాశారు.
తనకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం క్షమించదని స్పీకర్ రమేష్ కుమార్ హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు లేఖ రాశారు. ఈ విషయంపై సీఎం కుమారస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను పిలిపించి స్పీకర్ రమేష్ కుమార్ కు నచ్చచెప్పి ఆయన్ను అవమానానికి గురి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.