6 నెలలు యడియూరప్ప ప్రభుత్వం సేఫ్, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే, బీజేపీ మంత్రులు !
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి ఆరు నెలలు ఎలాంటి ఢోకా లేదు. సోమవారం శాసన సభలో మూజువాణిలో ఓటుతో సీఎం యడియూరప్ప తన మెజారిటీ నిరూపించుకున్నారు. యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో బీజేపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు ఎక్కువ రావడంతో ఆరు నెలల పాటు సీఎం యడియూరప్ప ప్రభుత్వం సాఫిగా సాగనుంది.
మాటల యుద్ధం
బలపరీక్షకు ముందు కొంతసేపు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే బలపరీక్షకు ముందు సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వకుండా సీఎం యడియూరప్ప అవిశ్వాస తీర్మాణం ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు.
రైతులు మా ఆప్తమిత్రులు
కర్ణాటక రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. రెంతులకు రెండు విడతలుగా తాము సహాయం చేస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప చెప్పారు. రైతులు మాకు ఆప్తమిత్రులని సీఎం యడియూరప్ప అన్నారు.
సీఎం పాతపాట
2018 ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రైత బెళగ పేరుతో తాము రైతుల కోసం ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చామని, ఇప్పుడు సీఎం యడియూరప్ప కొత్తగా తీసుకువచ్చిన పథకంలో కొత్త అంశంలేదని, బీజేపీ పాత పాట పాడుతోందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.
రెండు ఓట్లు ఎక్కువే !
17 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటంతో కర్ణాటక శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 207కి పడిపోయింది. సీఎం యడియూరప్ప బలపరీక్షలో నెగ్గడానికి 104 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా సొంత పార్టీ సభ్యులతో పాటు (105) ఒక స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో యడియూరప్ప విజయం లాంఛనమైయ్యింది.
ఆరు నెలలు సేఫ్
శాసన సభ నియమాల ప్రకారం మరో ఆరు నెలల పాటు విశ్వాస పరీక్ష నిర్వహించడానికి అవకాశం లేదు. ఇక ఆరు నెలల పాటు యడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకపోవడంతో బీజేపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.