కేరళలో కర్ణాటక సీఎంపై దాడికి యత్నం, దైవనాడులో దాష్టికాలా ? మలయాళ సీమ పరువు తీశారు, నీతి లేదు!
కొచ్చి/బెంగళూరు: కేరళలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చెయ్యడానికి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు చేదు అనుభవం ఎదురైయ్యింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు సీఎం యడియూరప్ప ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. దైవనాడుగా ప్రసిద్ది చెందిన మలయాళ సీమలో దాష్టికాలా ? అంటూ కర్ణాటక సీఎం యడియూరప్ప అసహనం వ్యక్తం చేశారు.
ఆంటీతో అక్రమ సంబంధం, మధ్యలో మరో యువకుడు, వాడిలో స్పెషల్ గా ఏముంది ?, సినిమా స్టైల్లో హత్య!
కేరళలో కర్ణాటక సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి (బీజేపీ) బీఎస్. యడియూరప్ప వ్యక్తిగత పర్యటన కేరళలో కొనసాగుతోంది. కణ్ణూరు సమీపంలోని తళిపరంబ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో బీఎస్ యడియూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో కర్ణాటక సీఎం యడియూరప్పకు అక్కడి ఆలయ అర్చకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక సీఎం యడియూరప్పకు దైవభక్తి ఎక్కువ.
సీఎం కారుపై దాడికి యత్నం!
శ్రీరాజరాజేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీఎస్. యడియూరప్ప అక్కడి నుంచి తన కారులో బయలుదేరారు. ఆ సమయంలో మంగళూరులో జరిగిన కాల్పులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, డీవైఎఫ్ఐ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించి సీఎం యడియూరప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం యడియూరప్ప ప్రయాణిస్తున్న కారుతో పాటు ఆయన కాన్వాయ్ మీద ఆందోళనకారులు దాడులు చెయ్యడానికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా కేరళ పోలీుసులు మాత్రం చోద్యం చూశారు తప్పా వారిని అడ్డుకోలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కేరళ పరువు తీశారు
కేరళలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసిన తీరుపై కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప అసహనం వ్యక్తం చేశారు. కేరళలో తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అని బీఎస్. యడియూరప్ప అన్నారు. కొందరు కుయుక్తితో చేసిన ఈపనికి తాను కేరళ ప్రజలు అందర్నీ దూషించడం లేదని సీఎం యడియూరప్ప అన్నారు. దైవనాడుగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సీమలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, కొందరు కావాలనే కేరళ పరువు తీశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
కేరళ సీఎం మరిచిపోయారు!
గతంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, మంగళూరు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘాలు నిర్వహించిన ఆందోళనలకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరైనారని, ఆ సమయంలో కర్ణాటక పోలీసులు ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారని, ఆ విషయం ఆయన మరిచిపోయారని కర్ణాటక బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
కేరళ సీఎంకు నీతి లేదు!
కర్ణాటక సీఎం హోదాలో పర్యటిస్తున్న యడియూరప్పకు భద్రత కల్పించే విషయంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, ఆయనపై దాడి చెయ్యడానికి ప్రయత్నించి కేరళ పరువు తీశారని కర్ణాటక బీజేపీ నాయకులు ఆరోపించారు. కర్ణాటకలో తన పర్యటనకు అక్కడి పోలీసులు పూర్తి భద్రత కల్పించారు అనే విషయం కేరళ సీఎం పినరయి విజయన్ మరిచిపోయారని, ఆయనకు నీతిలేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.