సహాయ నిధికి ఏడాది జీతం మొత్తాన్నీ విరాళంగా ప్రకటించిన ముఖ్యమంత్రి
బెంగళూరు: దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న భయానక కరోనా వైరస్ను నియంత్రించడానికి అన్ని కేంద్రం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విరాళాలను ఆశిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఫలితంగా- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా బోసిపోయే పరిస్థితి నెలకొంది.
ఒకేరోజు 43: జగన్ సొంత జిల్లాలో అత్యధిక కరోనా పాజిటివ్: పులివెందుల సహా..: 87కు చేరిన కేసులు
ఈ పరిస్థితుల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ సహాయక చర్యలకు ఆటంకాన్ని కలిగించకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున విరాళాలను ఆశిస్తున్నాయి. దీనితో ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఓ అడుగు ముందుకేశారు. తన సంవత్సరం వేతనం మొత్తాన్నీ ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికిగా విరాళంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి తాము చేపట్టిన సహాయక, పునరావాస చర్యలకు భారీగా విరాళాలను అందజేయాలని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. తమకు తోచిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరికొంత సమయం పడుతుందని, అప్పటిదాకా ఆర్థికంగా ఇబ్బందులు తప్పబోవనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. శాండిల్ వుడ్ టాప్ హీరో పునీత్ రాజ్కుమార్ 50 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. యడియూరప్పను కలిసి ఆయన చెక్కును అందజేశారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు.