విచిత్రం: మంత్రులే లేని నాలుగు మంత్రివర్గ సమావేశాలు, సీఎం యడియూరప్ప సంతకం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతున్నాయి. ఒక్క మంత్రి కూడా లేకుండానే సీఎం యడియూరప్ప మంత్రివర్గం సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు సీఎం యడియూరప్ప వివిద శాఖలకు చెందిన అధికారులతో నాలుగు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించారు.
విచిత్రం ఏమిటంటే కర్ణాటకలో ఇప్పటి వరకు మంత్రివర్గం ఏర్పాటే చెయ్యలేదు. కేలవం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిద శాఖలకు చెందిన అధికారులతో సీఎం యడియూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మూడు వారాల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.
కర్ణాటక ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి (ముఖ్యమంత్రి) బీఎస్. యడియూరప్ప. మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్లు సంతకాలు చేసే రిజిస్టర్ లో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఒక్కరే సంతకం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజలు సమస్యలు పరిష్కరించడం కోసం సీఎం యడియూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులతో పాటు సీనియర్ అధికారులతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహిస్తున్నారు.
మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి కోసం సీఎం యడియూరప్ప వేచి చూశారు. బీజేపీ హైకమాండ్ అనుమతితో బీఎస్. యడియూరప్ప ఆగస్టు 20వ తేదీ మంగళవారం మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి సిద్దం అయ్యారు. అయితే ఇప్పటికే సీఎం యడియూరప్ప నేతృత్వంలో అధికారికంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి.