కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర భూభాగం: అంగుళం భూమినీ వదులుకోం: అవసరమైతే ఎందాకైనా: యడ్డీ..!
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం క్రమంగా రాజకీయ రంగును పులుముకుంటోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న శివసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు తెగే దాకా లాగేలా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర భూభాగాన్ని కర్ణాటక ఆక్రమించిందంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనలకు ధీటుగా సమాధానమిచ్చారు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప. అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని తేల్చేశారు. అవసరమైతే ఎందాకైనా వెళ్తామని హెచ్చరించారు.
కొల్హాపూర్ లో ఉద్రిక్తత
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్ఠిబొమ్మను దగ్ధం చేసే స్థితికి చేరుకుంది. కన్నడ భాషా చలన చిత్రాల ప్రదర్శనను నిలిపివేసేంతలా పరిణమించింది. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి కర్ణాటకలోని బెళగావికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. కొల్హాపూర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి కర్ణాటకలోకి..
ఇదివరకు బొంబాయి ప్రెసిడెన్సీలో దశాబ్దాల తరబడి కొనసాగిన బెళగావి ప్రాంతాన్ని రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా కర్ణాటకలో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. బెళగావి జిల్లా మొత్తాన్నీ మహారాష్ట్రలో కలపాలనేది ప్రధాన డిమాండ్. మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ జిల్లాలో కన్నడ కంటే కూడా మరాఠీని మాట్లాడేవారి సంఖ్యే అధికంగా ఉంటుంది. దీనిపై ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలం నుంచే వివాదం నడుస్తోంది. సుప్రీంకోర్టులో సైతం కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
మళ్లీ రగులుకున్న వేడి..
బెళగావి జిల్లాను మహారాష్ట్రలో విలీనం చేయాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. కొద్దిరోజుల కిందటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్వయంగా.. ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. బెళగావి జిల్లా ఇదివరకు మహారాష్ట్రలోనే ఉండేదని, రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఆ ప్రాంతం కర్ణాటకలో విలీనమైందని చెప్పుకొచ్చారు. తాము కోల్పోయిన తమ ప్రాంతాన్ని మళ్లీ సాధించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బెళగావిని కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర భూభాగంగా ఆయన అభివర్ణించారు.
మండిపడ్డ యడియూరప్ప..
ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనలపై యడియూరప్ప ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన డిమాండ్ చేయంగానే ఇచ్చేయడానికి ఇదేమి బహుమతుల ప్రదానోత్సవం కాదని అన్నారు. అంగుళం స్థలాన్ని కూడా వదులుకోబోమని చెప్పారు. సరిహద్దు గొడవలపై మహాజన్ కమిటీ ఏర్పాటైన విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు. మహాజన్ కమిటీ తన నివేదికలో సూచించే అంశాల ప్రాతిపదికన సరిహద్దు గొడవలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.