సిద్దూ ప్రభుత్వంలో స్కాంలు, రూ. వేల కోట్లు స్వాహా ?, సీబీఐ విచారణ, చిక్కుల్లో కాంగ్రెస్!
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వంలో అమలు చేసిన ఐదు పథకాల స్కాంలపై విచారణ జరిపించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సిద్దం అయ్యారు. ఐదు స్కాంలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐకి సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారు. సిద్దరామయ్యతోపాటు ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టటర్లు, అధికారులు చిక్కుల్లో పడ్డారు.
అద్దెకు భారీ వినాయకుడి విగ్రహాలు, ఆశ తీరింది, డబ్బు మిగిలింది, ట్రెండ్ సెట్ చేశారు!
బెంగళూరు చెత్త స్కాం
బెంగళూరులో చెత్త సేకరించి దానిని వేరు చేసి విభజించడానికి ఉపయోగించే వాహనాల కొనుగోలు కాంట్రాక్టు (టీపీఎస్) ఇచ్చే ముసుగులో రూ. 96 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. బాగలూరు, మిట్టగానహళ్ళి క్వారీల దగ్గర లైనర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్టులో రూ. 109 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సీఎం బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.
రూ. 15 వేల కోట్ల స్కాంలు
బీజేపీ నాయకుడు, బీబీఎంపీ కార్పొరేటర్ ఎన్ఆర్. రమేష్ సిద్దరామయ్య ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. కృషి భాగ్య పథకంలో రూ. 9,014 కోట్లు అవినీతి జరిగిందని, చెత్త వేరు చేసే కాంట్రాక్టు విషయంలో రూ. 1,066 కోట్లు గోల్ మాల్ జరిగిందని, వైజ్ఞానిక చెత్త వేరే చేసే ప్లాంట్ లు ఏర్పాటు చేసే ముసుగులో రూ. 4,010 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు ఎన్ఆర్. రమేష్ ఆరోపించారు.
కృషి భాగ్య స్కాం !
సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కృషి భాగ్య పథకం అమలు చేసింది. కృషి భాగ్య పథకంకు సంబంధించి 131 తాలుకాల్లో, ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ (కృషి) డైరెక్టర్లను కచ్చితంగా విచారణ చేసి, రికార్డులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.
చిక్కుల్లో నేతలు, కాంట్రాక్టర్లు
కర్ణాటక మాజీ మంత్రి కృష్ణభైరేగౌడ, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శులు, 26 జిల్లాల వ్యవసాయ శాఖ డైరెక్టర్లు, 131 తాలుకాల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు చిక్కుల్లో పడుతున్నారు. చెత్త వేరు చేసే కాంట్రాక్టుల విషయంలో మాజీ మంత్రి కేజే. జార్జ్, 41 మంది చెత్త సేకరించే కాంట్రాక్టర్లు, టీపీఎస్ సంస్థ నిర్వహకులు, రాణాజార్జ్ భాగస్వామి సందీప్ రెడ్డి తదితరులు, రాజకీయ నాయకులు, అధికారులు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు.
చెత్త కోసం రూ. వేల కోట్లు
బెంగళూరు నగరంలో చెత్త సేకరించి దానిని విభజించడానికి బీబీఎంపీ రూ. 1,067 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ చెత్త సేకరణ కాంట్రాక్టులో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు ఎన్ఆర్. రమేష్ సంబంధిత పత్రాలతో సహ బయటపెట్టారు. రూ.4,010 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో చెత్త విభజన చేసే కేంద్రాలు ఏర్పాటు చేశారని, అందులో చాల కేంద్రాలు మూతపడ్డాయని ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ లీడర్స్, కాంట్రాక్టర్లు
బాగలూరు, మిట్టగానహళ్ళి, బెళ్ళళ్ళి క్వారీలో రూ. వందల కోట్లు ఖర్చు చేసి లైనర్లు ఏర్పాటు చేశారని, అందులో వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ నాయకులు, అధికారులు స్వాహా చేశారని ఎన్ఆర్. రమేష్ సీఎం యడియూరప్పకు ఫిర్యాదు చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వంలోని ఈ ఐదు స్కాంల మీద విచారణ చెయ్యాలని సీఎం యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.