వేట ప్రారంభించిన బీజేపీ..!? తెరమీదికి సీఎం ఫోన్ ట్యాపింగ్: రంగంలో సీబీఐ..ఇక చుక్కలే!
బెంగళూరు: రాజకీయపరమైన కక్ష సాధింపులు ఉండవని అంటూనే.. అధికార పార్టీ భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. దీనికోసం ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐనే రంగంలోకి దించబోతోంది. మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి అప్పగిస్తూ తాజాగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో కలకలాన్ని రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్ డీ కుమారస్వామిపై ఇది వరకు వెల్లువెత్తిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఈ కేసు వ్యవహారం తమ పరిధిలో లేదని ఆయన స్పష్టంచేశారు.
కుమారకు పొగబెట్టిన కాంగ్రెస్:
కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కమల నేపథ్యంలో ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి చెందిన కొందరు కీలక నేతలు, సీనియర్ ఐపీఎస్ అధికారుల ఫోన్లను అప్పటి కుమారస్వామి ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ వ్యవహారం తెర వెనుకే ఉండిపోయింది. వాటికి బలం కలిగిస్తూ.. కుమారస్వామి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ తిరుగుబాటు ఎమ్మెల్యే విశ్వనాథ్ తాజాగా ప్రకటించారు. ఆయన చేసిన ఆరోపణను అడ్డుగా పెట్టుకుని బీజేపీ ఈ కేసును తిరగదోడుతోంది. ఫోన్ ట్యాపరింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే కాదు.. స్వయంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేత సైతం డిమాండ్ చేయడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు
ఆపరేషన్ కమల జోరుగా సాగుతున్న సమయంలో కాంగ్రెస-జేడీఎస్ కూటమికి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయట. ఈ రకంగా కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో డిమాండ్ చేయించాలంటూ కాంగ్రెస్ సభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. బీజేపీ నాయకులతో వారు గళం కలపడం జేడీఎస్ కు సమస్యలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీజేపీకి తోడు కావడంతో కుమారస్వామి ఒంటరివారయ్యారని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలియదని, ఈ తతంగం ఎప్పుడూ తన దృష్టికి రాలేదని సిద్ధరామయ్య చెప్పడం.. అనేక అనుమానాలకు తెర తీసింది. ఫోన్ ట్యాప్ ఎవరు చేసినా తప్పేనని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేయడం పట్ల కుమారస్వామి ఇరకాటంలోొ పడ్డారు.
ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు..
ఫోన్ల ట్యాపింగ్ వ్వవహారంపై కుమారస్వామి ఆత్మరక్షణలో పడ్డారు. వివరణ ఇచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుగా ఉంటుందని ఆయన ఆశించినప్పటికీ.. దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొనడం ఆయనను ఆందోళనకు గురి చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలను భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదని కుమారస్వామి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చి తనకు తృణప్రాయమని, దాని కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారాన్ని కాపాడుకోవాలనే తపన తనకు కలగ లేదని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవాలని తాను అనుకుని ఉంటే.. దానికి అనుగుణంగా పక్కా వ్యూహాలను పన్ని ఉండేవాడినని అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదని, కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని అందుకున్న తరువాత.. అది ఎప్పటికైనా ఊడిపోయేదేనని తాను ముందే నిర్ణయించుకున్నానని అన్నారు.